Skip to content
తెలంగాణ వార్తలు

అక్రమ సంబంధాలపై అధికారులకు సజ్జనార్ హెచ్చరిక.. పోలీసులపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయొద్దని వార్నింగ్..

Prajapaksham 31 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
అక్రమ సంబంధాలపై అధికారులకు సజ్జనార్ హెచ్చరిక.. పోలీసులపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయొద్దని వార్నింగ్..

Sajjanar

పోలీస్ శాఖ అంతర్గత క్రమశిక్షణ, వ్యవస్థ ప్రతిష్ఠ కాపాడే విషయంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీలోని చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి శిఖర పూజలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పోలీసు వర్గాల్లో వెలుగుచూసిన వివాదాస్పద సంఘటనలపై స్పందిస్తూ, విధి నిర్వహణలో గానీ, వ్యక్తిగత ప్రవర్తనలో గానీ హద్దులు దాటి ప్రవర్తించే అధికారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణల కేసు విచారణ పూర్తిగా నిష్పాక్షికంగా కొనసాగుతోందని, దీనిపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఏ హోదాలో ఉన్న అధికారి అయినా అనాలోచిత చర్యలు, వేధింపులు లేదా అక్రమ సంబంధాలకు పాల్పడినట్లు రుజువైతే శాఖాపరంగా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్, మలక్‌పేట్, దోమలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న ఘటనల్లో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను, ట్రైనీ ఐపీఎస్‌ను సస్పెండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

శాఖలోని వివాదాస్పద అధికారుల వివరాలు, వారి ప్రవర్తనను సేకరించేందుకు స్పెషల్ బ్రాంచ్ (SB) ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. పోలీస్ శ్రేణులు తాము ధరించే యూనిఫాం వెనుక ఉన్న బాధ్యతను, ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలని సూచించారు. యూనిఫాంను అడ్డుపెట్టుకుని చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అన్నారు.

బాధితులకు న్యాయం అందించడమే పోలీస్ వ్యవస్థ ప్రాథమిక బాధ్యత అని సజ్జనార్ స్పష్టం చేశారు. కొందరు వ్యక్తుల స్వార్థం, అక్రమ చర్యల వల్ల మొత్తం పోలీస్ శాఖకు మచ్చ రాకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా రక్షణే తమ ప్రాధాన్యత అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు: Sajjanar Telangana Telangana Police