Peddapalli Municipal AE: పెద్దపల్లి మున్సిపల్ ఏఈ ఇంట్లో అవినీతి నోట్ల కట్టలు.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన కల్లేపల్లి సతీశ్ కుమార్..
Peddapalli Municipal AE: పెద్దపల్లి మున్సిపల్ ఏఈ ఇంట్లో అవినీతి నోట్ల కట్టలు.. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన కల్లేపల్లి సతీశ్ కుమార్.. నిందితుడు అరెస్ట్..
Peddapalli Municipal AE: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం మెరుపు దాడిలు చేశారు. ఈ దాడుల్లోఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా (ఏఈ) విధులు నిర్వహిస్తున్న కల్లేపల్లి సతీశ్ కుమార్.. ఒక కాంట్రాక్టర్ నుండి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు.
పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ, కునారం రోడ్డు పరిధిలో ఉన్న హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు సంబంధించి సదరు కాంట్రాక్టర్కు రూ.12.28 లక్షల ఆఖరి బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లును ప్రాసెస్ చేసి.. మంజూరు కోసం పైఅధికారులకు పంపడానికి ఏఈ సతీశ్ కుమార్ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారు పక్కా నిఘా ఏర్పాటు చేశారు. వ్యూహం ప్రకారం మంగళవారం సతీశ్ కుమార్ నివాసంలోనే బాధితుడి నుండి లంచం సొమ్మును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని పట్టుకున్నారు.
సతీశ్ కుమార్ను అదుపులోకి తీసుకున్న అనంతరం అధికారులు అతని ఇల్లు, కార్యాలయంలో సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని ఏకంగా రూ.32,31,900 అక్రమ నగదు లభించడంతో అధికారులు షాకయ్యారు. లంచం డబ్బులతో పాటు ఈ నగదును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని.. త్వరలోనే కరీంనగర్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.