Gajularamaram Bus Terminal: హైదరాబాద్లో 100 ఎకరాల్లో మెగా బస్ డిపో.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
Gajularamaram Bus Terminal
హైదరాబాద్లోని గాజులరామారం ప్రాంతంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి Nitin Gadkari వెల్లడించారు. గతంలో హెచ్ఎంటీ భూమిని దీర్ఘకాల లీజుకు తీసుకునే ప్రతిపాదన విఫలం కావడంతో, తెలంగాణ ప్రభుత్వం గాజులరామారంలో ప్రత్యామ్నాయంగా 100 ఎకరాల భూమిని టీజీఎస్ఆర్టీసీకి కేటాయించినట్లు తెలిపారు.
Gajularamaram Bus Terminal: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగర శివార్లలోని గాజులరామారంలో 100 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ టెర్మినల్ అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జగద్గిరిగుట్ట ప్రతిపాదన రద్దు – గాజులరామారంలో భూ కేటాయింపు: లోక్సభలో ఎంపీలు చామల కిరణ్కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గతంలో జగద్గిరిగుట్ట సమీపంలో హెచ్ఎంటీకి (HMT) చెందిన స్థలాన్ని 99 ఏళ్ల లీజుకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కోరినప్పటికీ.. హెచ్ఎంటీ అధికారులు కేవలం 20 ఏళ్లకే లీజు ఇస్తామని.. ఏటా రూ.6 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాలని షరతులు విధించడంతో ఆర్టీసీ ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుందని వివరించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో 100 ఎకరాల స్థలాన్ని టీజీఎస్ఆర్టీసీకి కేటాయించింది. ప్రస్తుతం జగద్గిరిగుట్ట మీదుగా రోజుకు 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు మొత్తం 404 ట్రిప్పులు తిరుగుతున్నాయని, కొత్త టెర్మినల్తో రవాణా సౌకర్యాలు మరింత విస్తృతమవుతాయని మంత్రి పేర్కొన్నారు.
గాజులరామారం టెర్మినల్ ప్రత్యేకతలు:
ఇంటర్ స్టేట్ & సిటీ బస్ టెర్మినల్స్: ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం ప్రత్యేకంగా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ (ISBT), నగర పరిధిలోని బస్సుల కోసం సిటీ బస్ టెర్మినల్ను వేర్వేరుగా నిర్మిస్తారు.
ఈ-బస్సు ఛార్జింగ్ స్టేషన్లు: పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఇక్కడ అత్యాధునిక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.
నగర బస్టాండ్లపై ఒత్తిడి తగ్గుదల: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు నగర నడిబొడ్డుకు రాకుండా ఈ టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయి. దీనివల్ల ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ (JBS) బస్టాండ్లపై రద్దీ తగ్గి, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు పెద్ద ఉపశమనం లభించనుంది.
- Pakistan Imran Khan: పాకిస్థాన్ లో అలజడి… ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు
- Ukraine – Russia War: ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడులు…రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి…
- Moosi River Front: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
- Telangana New Ration Cards: కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులు పంద్రాగస్టు నుంచి పంపిణీ
- దేశంలో ఎన్డిఎ అవినీతి పాలనపై సీపీఐ పోరు బాట.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో నిరసన..