Women Reservation: షరతులు లేకుండా మహిళా కోటా అమలు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
Women Reservation: షరతులు లేకుండా మహిళా కోటా అమలు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
పునర్విభజన తర్వాతే కోటా అమలు..
రాహుల్-రిజిజు మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం
ఎలాంటి షరతులు లేకుండా, దేనితోనూ ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను బయటకు వ్యక్తం చేయలేకపోతే ఏ దేశమూ విజయం సాధించలేదని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో చట్టసభలో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు ఆయనకు మధ్య వాగ్వాదం చెలరేగింది. వారిద్దరూ ఎక్స్ వేదికగా మాటల తూటాలు పేల్చుకున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి, కాంగ్రెస్ మద్దతుతోనే పార్లమెంటులో ఈ బిల్లు పూర్తిస్థాయిలో విజయవంతంగా ఏకగ్రీవంగా ఆమోదం పొందిందన్న విషయం రిజిజుకు బాగా తెలుసు, మూడేళ్లు గడిచినా ఎందుకు మహిళా కోటా అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారు, ఎందుకు అనవసరంగా నియోజకవర్గాల పునర్విభజనకు దీనికి ముడిపెడుతున్నారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
దీనికి ప్రతిగా కిరణ్ రిజిజు స్పందిస్తూ, 2026లో జనాభా లెక్కల సేకరణ తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్న విషయం రాహుల్ గాంధీకి చాలా స్పష్టంగా తెలుసునని ఎదురుదాడి చేశారు.
స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయకపోతే ఏ దేశమూ విజయవంతం కాబోదని రాహుల్ చెప్పడాన్ని రిజిజు ప్రస్తావిస్తూ, ఆయనలో హృదయ పరివర్తన వచ్చిందని, ఇదేవిధమైన సహకారం చట్టం అమలులో కూడా అందించాలని కోరారు.
దీనిపై ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ, కాంగ్రెస్ మద్దతు కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిందని గుర్తుచేశారు. 2023 నాటి ఈ చట్టాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లోక్సభలోనూ, రాష్ట్రాలలో ఉన్న శాసనసభల్లోనూ మహిళలకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు అంశాన్ని 2023లో రాజ్యాంగానికి చేసిన 106వ సవరణలో పొందుపరచిన విషయం రాహుల్ గాంధీకి చాలా స్పష్టంగా తెలుసునని, అయినాగానీ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో అమలులోకి వస్తాయన్న విషయం రాహుల్ గాంధీకి బాగా తెలుసునన్నారు.
“2026లో జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. ఈ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత తుది విడత జనాభా గణాంకాల జాబితాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత కులపరంగా జనాభా గణాంకాల వివరాలను తేల్చవలసి ఉంది. ఈ వివరాలన్నీ పూర్తిగా జాబితాల ప్రకారం బయటకు రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కారణాల రీత్యా కనీసం 2034 నాటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈ వ్యవహారం తేలకపోవచ్చు. అప్పటివరకూ మహిళా రిజర్వేషన్లు అమలు జాప్యం కావచ్చు. అందువల్ల తదుపరి 2029లో రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా ప్రస్తుతం తాజాగా అందుబాటులోకి వచ్చే జనాభా లెక్కల ప్రకారం వీలైనంత త్వరగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అమలు చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది” అని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
రాజ్యాంగ సవరణలతోపాటు లోక్సభలో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు–2026లో చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల అమలు పద్ధతి ఆధారపడి ఉంటుంది. అయితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశపెట్టినప్పటికీ, ఈ బిల్లు ఆమోదం పొందలేదు. ఈ బిల్లును ఓడించారు. ఆ మరునాడే ఏప్రిల్ 17వ తేదీన మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన 106వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందింది.
“కానీ లోక్సభలో, రాష్ట్రాలలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే 131వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాల్సి ఉంది. కానీ ఆమోదం పొందలేదు” అని కిరణ్ రిజిజు కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టారు.
అదేవిధంగా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక విషయాన్ని బాగా గుర్తుచేయాలి. అదేమిటంటే కర్ణాటకలో ముఖ్యమంత్రి டி.కె. శివకుమార్ నాయకత్వంలో ఉన్న మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా మంత్రిపదవులు పొందలేదు. దీనిని బట్టి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి” అని ఎక్స్ వేదికగా రిజిజు విమర్శించారు.
మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై గురువారంనాడు రిజిజు టెలిఫోన్ ద్వారా రాహుల్ గాంధీతో సంభాషించారు. అయితే ప్రతిపాదిత పునర్విభజన చట్టంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన రెండూ ముడిపడి ఉన్నందువల్ల సహాయ సహకారాలు అందించాలని కోరుతూ కిరణ్ రిజిజు గడచిన రెండు రోజుల్లో రెండుసార్లు రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలని కోరుతూ గడచిన పది రోజుల్లో రాహుల్ గాంధీని కిరణ్ రిజిజు రెండుసార్లు ముఖాముఖీ కలిసి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీతో, ఇతర ప్రతిపక్షాలతో మేం సమన్వయ చర్యలు తీసుకున్నామని గడచిన గురువారం ఆయన మీడియాకు చెప్పారు.
బిల్లును గెలిపించిందే కాంగ్రెస్.. మా గురించి మీరు ఆందోళన చెందకండి
ఒక్క మహిళా మంత్రి కూడా కర్ణాటక మంత్రివర్గంలో లేరని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా చేసిన విమర్శలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ తీవ్రంగా స్పందించారు. “అసలు మహిళా రిజర్వేషన్లను నడిపించిందే మేం అంటే కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ వల్లనే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ పార్టీ మహిళల అభ్యున్నతికోసం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పార్లమెంటులో ఎన్ని సీట్లు ఇచ్చిందో మీకు తెలుసా? నా ఉద్దేశం ప్రకారం మీకు అవన్నీ గుర్తుండే ఉంటాయి. అందువల్ల కర్ణాటక గురించి మీరు దిగులు పెట్టుకోకండి. ఖచ్చితంగా మేం ఈ సమస్యను పరిష్కరించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ గురించి రిజిజు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఇన్స్టాగ్రామ్ వేదికగా డి.కె. శివకుమార్ స్పందించారు. గురువారం జరిగిన “ఆస్క్ మీ ఎనీథింగ్” అనే సెషన్కు అదనంగా శివకుమార్ ఈ వ్యాఖ్యానాన్ని ఆయన తాజాగా జోడించారు.