Skip to content
జాతీయం వార్తలు

CJP Protest: విద్యార్థుల కోసం గళమెత్తిన సుప్రీంకోర్టు న్యాయవాదులు.. రాజ్యాంగ పీఠికతో నిరసన..ధన్యవాదాలు తెలిపిన సీజేపీ..

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
CJP Protest: విద్యార్థుల కోసం గళమెత్తిన సుప్రీంకోర్టు న్యాయవాదులు.. రాజ్యాంగ పీఠికతో నిరసన..ధన్యవాదాలు తెలిపిన సీజేపీ..

Supreme Court Lawyers Recite Constitution's Preamble, Seek Justice for Students

CJP Protest: నీట్ (NEET) పేపర్ లీకేజీ అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని ఖండిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాదులు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం లంచ్ విరామంలో సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్‌స్టిట్యూషన్ బ్యానర్ కింద సుప్రీంకోర్టు ప్రాంగణంలో సమావేశమైన న్యాయవాదులు, నిరసనకారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా రాజ్యాంగ ప్రవేశికను బిగ్గరగా పఠించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్, ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్. మురళీధర్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అధ్యక్షుడు డాక్టర్ వికాస్ సింగ్ నేతృత్వంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న దారుణ హింసాకాండను, దమనకాండను వారు తీవ్రంగా ఖండించారు. బాధితులైన విద్యార్థుల వైపు నిలబడటం తమ రాజ్యాంగ బాధ్యత అని ఇందిరా జైసింగ్ స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని.. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిజెపి (CJP) ఆధ్వర్యంలో జూన్ 20 నుండి ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు ప్రముఖ వాతావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్, ఏఐఎస్ఏ (AISA) విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచి నిరాహార దీక్ష కూడా చేపట్టాయి. అయితే పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విద్యార్థులపై మోపిన అక్రమ ఎఫ్‌ఐఆర్‌లను తక్షణమే ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని విరమించేది లేదని సిజెపి ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

మరోవైపు ఈ వివాదంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నీట్ పేపర్ లీకేజీ కేసుల్లో నిందితులను త్వరితగతిన విచారించి కఠినంగా శిక్షించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని గురువారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తుతో ఆడుకునే అక్రమార్కులను ఎంతమాత్రం వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.