Skip to content
జాతీయం వార్తలు

Dharmendra Pradhan Resignation Rejected: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు… తేల్చి చెప్పిన కేంద్రం…NTA లో 47 మందిపై వేటు…

Prajapaksham 24 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Dharmendra Pradhan Resignation Rejected: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు… తేల్చి చెప్పిన కేంద్రం…NTA లో 47 మందిపై వేటు…

నీట్ (NEET) పేపర్ లీక్ ఉదంతం, పరీక్షల అక్రమాల నేపథ్యంలో ప్రతిపక్షాలు, సీజేపీ (CJP) నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. ప్రతిపక్షాలు చేస్తున్న రాజీనామా డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం ఆమోదించదని స్పష్టం చేశాయి. దేశ ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, కాబట్టి తాము మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సమస్య ఎదురైనప్పుడు రాజీనామా చేసి తప్పుకోవడం అత్యంత తేలికైన మార్గమని, అయితే బాధ్యతగల ప్రభుత్వంగా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించాయి. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ వెంటే ప్రభుత్వం, మొత్తం పార్టీ బలంగా నిలబడ్డాయని వెల్లడించాయి.

NTA లో ప్రక్షాళన.. 47 మంది అధికారులపై వేటు
కేవలం రాజీనామాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భారీ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా NTAలోని 47 మంది అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన అక్రమాలకు పాల్పడిన కొందరు అధికారులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది.

రాధాకృష్ణన్ కమిటీ మార్గదర్శకాలతో కొత్త నియామకాలు
పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న లోపాలను సరిదిద్దడానికి ఏర్పాటైన ప్రొఫెసర్ కె. రాధాకృష్ణన్ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు NTAని పునర్నిర్మించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 47 మంది అధికారుల తొలగింపుతో పాటు, సంస్థలో పారదర్శకత పెంచేందుకు కొత్త భర్తీ ప్రక్రియను కూడా ప్రారంభించింది. నాలుగు సీనియర్ జనరల్ మేనేజర్ పోస్టులతో పాటు, UPSC ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 16 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి ప్రకటన విడుదల చేసింది. రాబోయే రోజుల్లో NTAని మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అధునాతన సాంకేతికతతో నిర్వహించేందుకు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.