Skip to content
జాతీయం వార్తలు

జేఈఈ డేటా బహిర్గతంపై కేంద్రంపై సీజేపీ దాడి.. విద్యార్థుల డేటా భద్రతపై ఆందోళన.. విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్..

Prajapaksham 05 Jun 2026 0 నిమిషాల పఠనం జాతీయం
జేఈఈ డేటా బహిర్గతంపై కేంద్రంపై సీజేపీ దాడి.. విద్యార్థుల డేటా భద్రతపై ఆందోళన.. విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్..

Are ‘Cockroaches’ Revolutionaries? Remark Sparks Political Debate

జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) 2026 ఫలితాల పోర్టల్‌లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపం కారణంగా విద్యార్థుల వ్యక్తిగత డేటా బహిర్గతమైందన్న వార్తలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దేశ విద్యా వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఎంత అసమర్థ వ్యక్తులు నడుపుతున్నారో ఈ పరిణామం స్పష్టం చేస్తోందని ఆ పార్టీ గురువారం నాడిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండిపడింది. ఈ ఘటన దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు మరియు పరీక్ష ఫలితాల గోప్యతను ప్రమాదంలో పడేసిందని, ఇది దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ తీరుపై సరికొత్త ఆందోళనలను రేకెత్తించిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా వేదికగా ప్రారంభమై ఆ తర్వాత పెద్ద ఎత్తున విస్తరించిన ఈ ఉద్యమ నాయకులు విద్యా రంగంలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. లక్షలాది మంది భవిష్యత్ ను నిర్థారించే నంబర్ వన్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన డేటా లీక్ అయినందుకు బాధ్యత వహిస్తూ ఆయనను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీజేపీ విజ్ఞప్తి చేసింది. ఫలితాల వెబ్‌సైట్‌కు అనుసంధానించబడిన క్లౌడ్ స్టోరేజ్ ఎలాంటి ధృవీకరణ లేకుండా అందుబాటులో ఉండటం వల్లే ఈ సాంకేతిక లోపం తలెత్తిందని, డిజిటల్ భద్రతలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని క్షమించలేమని స్పష్టం చేశారు.

ఈ డేటా ఉల్లంఘనకు నిరసనగా జూన్ 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని సీజేపీ ఇదివరకే ప్రకటించింది. అయితే ఈ ఆందోళనకు ఢిల్లీ పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించినప్పటికీ, తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. విద్యార్థుల హక్కుల కోసం, విద్యా వ్యవస్థలో భద్రతను పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తూ తాము అనుకున్న ప్రకారమే జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.