Skip to content
జాతీయం వార్తలు

Bypoll Results 2026: గుజరాత్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు.. మంజల్పూర్‌లో వికసించిన కమలం, దతియాను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్..

Prajapaksham 03 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Bypoll Results 2026: గుజరాత్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు.. మంజల్పూర్‌లో వికసించిన కమలం, దతియాను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్..

BJP VS Congress

Bypoll Results 2026: దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా సాగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిలబెట్టుకోగా.. మధ్యప్రదేశ్‌లోని దతియా స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గుజరాత్‌లోని వడోదర జిల్లా మంజల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీపై 30,630 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు.

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం సతీశ్ పటేల్‌కు 55,481 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీకి 24,851 ఓట్లు లభించాయి. 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే నాటికే బీజేపీ విజయం ఖరారైంది.

సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి యోగేశ్ పటేల్ జూన్ 2న మరణించడంతో ఈ స్థానానికి జూలై 30న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే పోటీలో నిలిచాయి. ఈ విజయంతో 182 సభ్యుల గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ బలం 162కు పెరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 12 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి.

మరోవైపు మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి కున్వర్ ఘనశ్యామ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఘనశ్యామ్ సింగ్‌కు 66,757 ఓట్లు లభించగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికలో ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థి దామోదర్ యాదవ్ కూడా దాదాపు 22 వేల ఓట్లు సాధించి గణనీయమైన ప్రభావం చూపారు.