Skip to content
జాతీయం వార్తలు

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు.. నిర్దోషిగా విడుదలైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌

Prajapaksham 03 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు.. నిర్దోషిగా విడుదలైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌

Brij Bhushan Sharan Singh

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల వ్యవహారంలో.. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపై వచ్చిన అభియోగాలను తోసిపుచ్చుతూ దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. బ్రిజ్‌భూషణ్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.

కేసు విచారణ సందర్భంగా బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో స్పష్టమైన వ్యత్యాసాలు ఉండటం, అలాగే ఆరోపణలను రుజువు చేసేందుకు ప్రాథమిక ఆధారాలు లభించకపోవడంతో న్యాయస్థానం ఈ ఫిర్యాదును కొట్టివేసింది.

2016 నుంచి 2019 మధ్యకాలంలో బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధించారంటూ 2023లో దేశంలోనే అగ్రశ్రేణి రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా నేతృత్వంలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యంతో వీరు తాత్కాలికంగా ఆందోళన విరమించినప్పటికీ, తగిన చర్యలు లేవంటూ ఆరుగురు మహిళా రెజ్లర్లు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది.

ఈ ఆందోళనల క్రమంలో పార్లమెంట్ నూతన భవనం ముట్టడికి యత్నించిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకుని రహదారులపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో బాధితురాలిగా ఉన్న ఒక మైనర్ రెజ్లర్ గతంలోనే తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో బ్రిజ్‌భూషణ్‌పై నమోదైన ‘పోక్సో’ (POCSO) కేసు రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన ఆరుగురు రెజ్లర్ల ఆరోపణలపై సాగిన విచారణలో రౌజ్ అవెన్యూ కోర్టు తుది తీర్పు ఇవ్వడంతో బ్రిజ్‌భూషణ్‌పై ఉన్న ప్రధాన క్రిమినల్ విచారణ ప్రక్రియ అధికారికంగా ముగిసింది.

తీర్పు వెలువడిన అనంతరం బ్రిజ్‌భూషణ్ సింగ్ మాట్లాడుతూ.. నాపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఉరివేసుకుంటానని తొలిరోజే చెప్పాను. ఇన్నాళ్లకు న్యాయం గెలిచి, నేను నిర్దోషిగా బయటపడినందుకు ఎంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు: BJP national politics politics