Skip to content
జాతీయం వార్తలు

Bankipur Bypoll Result: బంకిపూర్ ఉప ఎన్నికల లెక్కింపు.. 3వ రౌండ్‌లోనూ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం.. వెనకబడిన బీజేపీ..

Prajapaksham 03 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Bankipur Bypoll Result: బంకిపూర్ ఉప ఎన్నికల లెక్కింపు.. 3వ రౌండ్‌లోనూ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం.. వెనకబడిన బీజేపీ..

Prashant Kishor vs BJP

బీహార్‌లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మూడో విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మూడవ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ఆయన 1,162 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.

మూడు విడతల లెక్కింపు సమాచారం ప్రకారం.. ప్రశాంత్ కిషోర్ మొత్తం 5,032 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, బీజేపీకి చెందిన నీరజ్ కుమార్ సిన్హా 3,870 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 767 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 31 విడతల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది.

తొలి ట్రెండ్స్ నుంచే ప్రశాంత్ కిషోర్ ముందంజలో ఉండటంతో జన సూరజ్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పార్టీ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రశాంత్ కిషోర్ సాధిస్తున్న ఈ ఆరంభ ఆధిక్యాన్ని మద్దతుదారులు సంబరంగా జరుపుకుంటూనే.. కొనసాగుతున్న లెక్కింపు సరళిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

మరోవైపు బంకిపూర్ ఉప ఎన్నికలో తమ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా ప్రస్తుతం వెనుకబడి ఉన్నప్పటికీ.. పాట్నాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంతిమ ఫలితంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. లెక్కింపు పురోగమించే కొద్దీ తమ అభ్యర్థి పుంజుకుని విజయం సాధిస్తారనే నమ్మకంతో పార్టీ మద్దతుదారులు సంబరాల కోసం లడ్డూలు తయారు చేస్తూ కనిపిస్తున్నారు.