Trump Generic Drug Tariffs: భారత ఫార్మా రంగానికి షాక్.. జనరిక్ ఔషధాలపై ట్రంప్ 200 శాతం సుంకాలు.. ఔషధ పరిశ్రమ ఆందోళన
Trump Generic Drug Tariffs: భారత ఫార్మా రంగానికి షాక్.. జనరిక్ ఔషధాలపై ట్రంప్ 200 శాతం సుంకాలు.. ఔషధ పరిశ్రమ ఆందోళన
Trump Generic Drug Tariffs: అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందుల దిగుమతులపై ప్రకటించిన కొత్త భారీ సుంకాల విధానం ప్రపంచ ఫార్మా రంగాన్ని, ముఖ్యంగా భారతీయ ఔషధ రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం, ఫార్మా తయారీని తిరిగి తమ దేశానికి తరలించడం (రీషోరింగ్) లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం ఈ సంచలనాత్మక ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది.
సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే తొలి రెండేళ్ల కాలంలో అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జెనరిక్ మందులపై ఎటువంటి సుంకం ఉండదు. అంటే సున్నా శాతం టారిఫ్ అమలులో ఉంటుంది. అయితే ఈ రెండేళ్ల సన్నాహక వ్యవధి ముగిసిన తర్వాత.. 2028 ఆగస్టు 1వ తేదీ నుండి ఏడాది పాటు ఏకంగా 100 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. ఆ తర్వాతి సంవత్సరం అంటే 2029 ఆగస్టు నాటికి ఈ సుంకాన్ని ఏకంగా 200 శాతానికి పెంచనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ కాలపరిమితిలోగా అమెరికా భూభాగంలో సొంత ఉత్పాదక కేంద్రాలు, ప్లాంట్లు ఏర్పాటు చేయని విదేశీ ఫార్మా కంపెనీలకు ఇది ఒక రకమైన ఆర్థిక జరిమానాగా పనిచేస్తుందని వైట్ హౌస్ అభిప్రాయపడింది. అదే సమయంలో పేటెంట్ పొందిన, బ్రాండెడ్ లేదా వినూత్న ఔషధాల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని కూడా అధికారులు ధ్రువీకరించారు.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చవకైన జెనరిక్ మందులను అత్యధికంగా ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే భారతదేశంపై అత్యంత ప్రతికూలంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.భారత్, అమెరికా ఆరోగ్య రంగానికి అత్యంత కీలకమైన భాగస్వామిగా కొనసాగుతోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదికలు.. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2025 నాటికి భారతదేశం సుమారు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఒక్క అమెరికాకే ఎగుమతి చేసింది.
ఇది భారతదేశపు మొత్తం ప్రపంచ ఔషధ ఎగుమతుల్లో ఏకంగా 38 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అమెరికన్ రోగులు నిత్యం ఉపయోగించే అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు మరియు మానసిక ఆరోగ్య రుగ్మతల చికిత్సలకు అవసరమయ్యే జెనరిక్ మందులలో దాదాపు 40 శాతానికి పైగా భారతీయ కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. అందువల్ల 100 నుండి 200 శాతం సుంకాల విధింపు అనేది భారతీయ ఫార్మా కంపెనీల ఎగుమతి నమూనాను, ఆదాయ ప్రాతిపదికను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జెనరిక్ ఔషధాల తయారీ వ్యాపారం అనేది బ్రాండెడ్ మందులలా కాకుండా అత్యంత తక్కువ లాభాల మార్జిన్తో (స్లిమ్ మార్జిన్స్) పనిచేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో 100 శాతం లేదా 200 శాతం పన్నులను భరించడం ఏ ఫార్మా కంపెనీకైనా ఆర్థికంగా సాధ్యం కాని పని. దీంతో భారతీయ కంపెనీలకు ఇప్పుడు మూడు రకాల ప్రతికూల ప్రత్యామ్నాయాలు మాత్రమే మిగులుతాయి. మొదటిది ఏంటంటే.. రాబోయే రెండేళ్ల వ్యవధిలో భారీ పెట్టుబడులు పెట్టి అమెరికాలో తయారీ ప్లాంట్లను ప్రారంభించడం.. రెండవది ఏంటంటే.. అమెరికాలో మందుల ధరలను భారీగా పెంచడం; లేదా మూడవది చూస్తే.. లాభదాయకం కాని మందుల సరఫరాను పూర్తిగా నిలిపివేయడం. అమెరికాలో తయారీ వ్యయం చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొత్త ప్లాంట్లు నెలకొల్పడం కూడా సులభమైన విషయమేమీ కాదు. మరోవైపు, మందుల ధరలు పెంచితే అమెరికాలోని సామాన్య పౌరులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తీవ్ర ఆర్థిక భారానికి గురయ్యే ప్రమాదం ఉంది.
ఈ వార్త వెలువడిన వెంటనే భారతీయ స్టాక్ మార్కెట్లలో ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లు విపరీతంగా పడిపోయాయి. పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురికావడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. అయితే, ట్రంప్ సర్కార్ ఇచ్చిన రెండేళ్ల గడువు వల్ల భారతీయ కంపెనీలకు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం లభిస్తుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
అంతేకాకుండా, భారతదేశం మరియు అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంతో, జెనరిక్ మందుల విషయంలో మినహాయింపులు లేదా తక్కువ సుంకాలను సాధించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలను వేగవంతం చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సుంకాలు అనుకున్నట్లుగానే అమల్లోకి వస్తే, అది కేవలం భారత ఫార్మా ఎగుమతులపైనే కాకుండా అమెరికా ప్రజల ఆరోగ్య సంరక్షణ వ్యయంపై, ప్రపంచ ఔషధ సరఫరా వ్యవస్థలపై సుదూర ప్రభావాలను చూపుతుందని స్పష్టమవుతోంది.