Skip to content
బిజినెస్ వార్తలు

హైదరాబాద్ నుంచి విజయవాడకు సీ-ప్లేన్ సేవలు.. హుస్సేన్ సాగర్ నుంచి టేకాఫ్.. ప్రకాశం బ్యారేజీ వద్ద ల్యాండింగ్..

Prajapaksham 10 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
హైదరాబాద్ నుంచి విజయవాడకు సీ-ప్లేన్ సేవలు.. హుస్సేన్ సాగర్ నుంచి టేకాఫ్.. ప్రకాశం బ్యారేజీ వద్ద ల్యాండింగ్..

Sea Plane

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పర్యాటక రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక సీ-ప్లేన్ (Seaplane) ప్రాజెక్టు వేగంగా ఆచరణ రూపం దాల్చుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చొరవ, కేంద్ర పౌర విమానయాన శాఖ సానుకూలతతో ఈ పథకం పనులు వేగం పుంజుకున్నాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ నుంచి విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వరకు సీ-ప్లేన్ సర్వీసులను నడిపేందుకు వీలుగా వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికారులు ఇప్పటికే ప్రాథమిక క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలసి ఈ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించారు. హుస్సేన్‌సాగర్ – ప్రకాశం బ్యారేజీలను అనుసంధానిస్తూ సీ-ప్లేన్ సేవలు ప్రారంభిస్తే రెండు రాష్ట్రాల మధ్య ఒక ప్రత్యేకమైన టూరిజం సర్క్యూట్ ఏర్పడుతుందని భావించారు. కేంద్ర నిపుణుల బృందం నాలుగు రోజుల క్రితం హుస్సేన్‌సాగర్‌లో పర్యటించి నీటి లోతు.. సీ-ప్లేన్ సురక్షిత టేకాఫ్, ల్యాండింగ్‌కు అవసరమైన అనుకూల ప్రాంతాలను పరిశీలించింది. త్వరలోనే ఈ బృందం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా సర్వే నిర్వహించనుంది.

ప్రత్యేక రన్‌వే అవసరం లేకుండా నీటిపైనే ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే ఈ సీ-ప్లేన్లలో ఒక్కో విమానంలో 9 నుంచి 12 మంది వరకు ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. గతంలో కేవలం ట్రయల్ రన్స్‌కే పరిమితమైన ఈ ప్రాజెక్టును ఈసారి పక్కా ప్రణాళికతో పూర్తిస్థాయి వాణిజ్య సర్వీసులుగా అందుబాటులోకి తీసుకురావాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదలతో ఉన్నాయి. ఏఏఐ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా తదుపరి అడుగులు పడనున్నాయి.