పేరడీకి చిరునామా జరుక్ శాస్త్రి
Jaruk Sastry is synonymous with parody.
నేడు జరుక్ శాస్త్రి జయంతి
పేరడీ అనే ప్రత్యేక హాస్య ప్రక్రియకు తెలుగులో పునాదులు వేసిన రచయిగా జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి (జరుక్ శాస్త్రి) పేరును ప్రస్తావించుకోవాలి. మొక్కపాటి నరసింహశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, పా నుగంటి లక్ష్మీనరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరా వు వంటి రచయితలు తెలుగు సాహిత్యంలో హాస్యానికి ప్రత్యేక స్థానం కల్పించారు. సున్నితమైన హాస్యంతో పాఠకులను ఆకట్టుకున్నారు. అయితే, జరుక్ శాస్త్రి మాత్రం హాస్యాన్ని, వ్యంగ్యాన్ని పేరడీ రూపంలో అందించి, తన ప్రత్యేకతను చాటుకున్నాడు. వాస్తవానికి పేరడీ రాయ డం అంత సులభమైన ప్రక్రియ కాదు. ఒక గొప్ప రచనలోని ప్రత్యేక లక్షణాన్ని గుర్తించి, దానిలోని అతిశయా న్ని సున్నితంగా ఎత్తిచూపుతూ, అసలు రచనను గుర్తు చే సే విధంగా హాస్యాన్ని పండించాలి. మూల రచనను అవమానపరచకుండా, దానిలోని ఒక కోణాన్ని వినోదాత్మకంగా చూపించాలి. ఈ నైపుణ్యంలో జరుక్ శాస్త్రి అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. అందుకే తెలుగు పేరడీ సాహిత్యానికి ఆయనను ఆద్యుడిగా భావిస్తారు. మహాకవి శ్రీశ్రీ రచించిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనవుతాను’ అనే ప్రసిద్ధ కవితను అనుకరిస్తూ, ‘నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను’ వంటి పంక్తులతో సామాజిక వాస్తవాలను వినోదాత్మకంగా ప్రతిబింబించిన పేరడీ ఆయన ప్రతిభకు తార్కాణం. 1914 సెప్టెంబర్ 7న బందరులో జన్మించిన జరుక్ శాస్త్రి సంస్కృతం, తెలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. కొంతకా లం ఆంధ్రపత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశాడు. మద్రాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో స్క్రిప్ట్ రచయితగా సేవలందించాడు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించాడు. తనలో తాను వంటి శీర్షికల ద్వారా తన ప్రత్యేక రచనా శైలిని పరిచ యం చేశాడు. ‘జరుక్ శాస్త్రి పేరడీలు’, ‘శరత్ పూర్ణిమ’ వంటి సంకలనాలు ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనా లు. అనేక పత్రికల్లో వ్యాసాలు రాసిన ఆయన, తన చమత్కార రచనలతో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 1968లో ఆయన కన్నుమూసినా, పేరడీ సాహిత్యంలో ఆయన వేసిన ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు.తెలుగు సాహిత్యంలో పేరడీని ఒక స్వతంత్ర సా హిత్య ప్రక్రియగా స్థిరపరిచిన ప్రముఖుల్లో జరుక్ శాస్త్రి త ర్వాత అంతటి పేరు సంపాదించుకున్న రచయిత మాచిరాజు దేవీప్రసాద్. ఆయన కేవలం పేరడీ కవితలకు మాత్రమే పరిమితం కాలేదు. గద్యరచనల్లోనూ ఈ ప్రక్రియకు విశిష్ట స్థానం కల్పించాడు. శ్రీశ్రీ, వేదుల సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ, శివశంకరశాస్త్రి, నాయని సుబ్బారావు వంటి ప్రముఖ రచయితల శైలులను దేవీప్రసాద్ అనుకరిస్తూ, వాటిలోని ప్రత్యేక లక్షణాలను చమత్కారంగా మలిచాడు. కార్యాలయ లేఖలు, పాఠకుల ఉత్తరాలు, అధికార భాష వంటి అంశాలపై కూడా పేరడీలు రచించి గద్య పేరడీకి కొత్త దిశ చూపించాడు. 1922లో జన్మించిన దేవీప్రసాద్ జీవితాన్ని కూడా హాస్య దృష్టితోనే చూశాడు. సాహిత్యంలో పేరుకు మూస ధోరణులు, అతిశయ భావుకత, కృత్రిమ భాష, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలు ఆయన పేరడీల ప్రధాన లక్ష్యాలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన రోజుల్లో అధికార వ్యవస్థలోని అవకతవకలను రచనల ద్వారా ఎండగట్టడంతో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా డు. అయినప్పటికీ తన విమర్శనాత్మక దృష్టిని వదల్లేదు. ఆయన ప్రతిభకు చక్కని ఉదాహరణ ‘భోజనశాల’ అనే పేరడీ. ఇది వేదుల సత్యనారాయణ ప్రసిద్ధ గేయం ‘రాధ’కు పేరడీ. మూల రచనలో శ్రీకృష్ణుడి కోసం విరహం తో వెదికే రాధ కనిపిస్తే, దేవీప్రసాద్ పేరడీలో ఆకలితో భోజనశాల కోసం వెదికే భోజనప్రియుడు కనిపిస్తాడు. మూల పద్యంలోని తొలి రెండు పాదాలను యథాతథం గా ఉంచి, తరువాతి పాదాల్లో చిన్న మార్పులతో పూర్తిగా భిన్నమైన హాస్యానుభూతిని సృష్టించాడు. ఈ విధానమే ఆంగ్ల సాహిత్యంలో ‘వెర్బల్ పేరడీ’గా స్థిరపడింది. వేణుగాన మాధుర్యాన్ని వర్ణించిన మూల పద్యాన్ని, బుచ్చెమ్మ భోజనశాలలోని పచ్చిపులుసు రుచిని కీర్తించేలా మలచడం దేవీప్రసాద్ చమత్కారానికి నిదర్శనం. యమునా ప్రవాహం స్థానంలో నోరూరడం, ప్రేమ పరవశం స్థానం భోజనోత్సాహం వంటి మార్పులు పాఠకుడికి సహజమైన నవ్వును పంచుతాయి. మూల కవిత్వంలోని లయ, భాష, భావవ్యక్తీకరణను కాపాడుతూ, వస్తువును మాత్ర మే మార్చి కొత్త అర్థాన్ని సృష్టించడం దేవీప్రసాద్ పేరడీల విశిష్టత. అందుకే తెలుగు సాహిత్యంలో కళాత్మకమైన పేరడీకి ఆయన రచనలు ఆదర్శంగా నిలిచాయి.