AP 12th PRC latest news: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..12వ పీఆర్సీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
Chandrababu Naidu
AP 12th PRC latest news: అమరావతిలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించిన అనంతరం వారికి సంబంధించిన కీలక నిర్ణయాలను వెల్లడించారు. పరిపాలనలో ఉద్యోగులు కూడా కీలక భాగస్వాములేనని, వారి సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తనవంతు సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం సమ్మతి తెలిపారు. 2024 జూలై 1, 2025 జనవరి 1 నుంచి బకాయిగా ఉన్న రెండు కరువు భత్యాలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రెండు డీఏలను 2026 అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2022కు సంబంధించిన సరెండర్ లీవ్ నగదు మొత్తాన్ని వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. పోలీసు సిబ్బందికి అదనంగా మరో సరెండర్ లీవ్ ప్రయోజనాన్ని కల్పిస్తూ, దాని నగదు చెల్లింపును ఈ దసరా సందర్భంగా చేయాలని నిర్ణయించారు.
పెన్షనర్లకు కూడా ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. 70 సంవత్సరాలు పూర్తయిన వారికి ప్రస్తుత పెన్షన్పై 10 శాతం అదనపు క్వాంటమ్, 75 సంవత్సరాలు దాటిన వారికి 15 శాతం అదనపు క్వాంటమ్ను 2027 జనవరి నుంచి అమలు చేయనున్నారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి ప్రతి నెలకు సంబంధించిన మొత్తాన్ని అదే నెలలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కు చెల్లించే విధానాన్ని అమలు చేయనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఖజానాపై ఏటా దాదాపు రూ.2,880 కోట్ల మేర అదనపు వ్యయం ఏర్పడనుంది.