28 New Zilla Parishads Established in AP: ఏపీలో జిల్లా పరిషత్ల పునర్వ్యవస్థీకరణ. 13 జెడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్లు ఏర్పాటు…
Chandrababu
New Zilla Parishads Established in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణను వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్లను పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 13 జెడ్పీల స్థానంలో, జిల్లాల సంఖ్య ఆధారంగా కొత్తగా 28 జెడ్పీలను ఆవిష్కరిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలను కూడా ఇందులో కలిపారు. రాష్ట్రంలోని 660 మండల ప్రజా పరిషత్లు భౌగోళిక ప్రాంతాల ప్రాతిపదికన సంబంధిత కొత్త జెడ్పీల పరిధిలోకి చేరుతాయి.
సెప్టెంబర్ 24 నుంచి అమలు
ఉమ్మడి 13 జిల్లాల ప్రకారం నడుస్తున్న ప్రస్తుత జెడ్పీ పాలకవర్గాల పదవీకాలం ఈ సంవత్సరం సెప్టెంబర్ 24తో పూర్తవుతుంది. ఆ గడువు ముగిసిన తక్షణమే 28 కొత్త జెడ్పీల పాలనా వ్యవస్థ అధికారికంగా రూపుదిద్దుకుంటుంది. కొత్త పరిపాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వం 30 కీలక పోస్టులను సృష్టించింది. వీటిలో 15 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పోస్టులు, మరో 15 డిప్యూటీ సీఈఓ పోస్టులు ఉన్నాయి. సీఈఓ పోస్టులకు రూ. 80,910 నుండి రూ. 1,66,680 వరకు, డిప్యూటీ సీఈఓ పోస్టులకు రూ. 65,360 నుండి రూ. 1,54,980 వరకు వేతన స్కేలును ఆర్థిక శాఖ ఖరారు చేసింది.
సిబ్బంది కేటాయింపు – సమన్వయం
ప్రస్తుత జెడ్పీల్లో పనిచేస్తున్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటయ్యే 28 జెడ్పీలకు మండలాల సంఖ్య, పనిభారాన్ని బట్టి హేతుబద్ధీకరించి కేటాయిస్తారు. 660 మండలాలను నూతన భౌగోళిక ప్రాంతాల ఆధారంగా జెడ్పీలకు అనుసంధానించే మ్యాపింగ్ బాధ్యతను పంచాయతీరాజ్ కమిషనర్ పూర్తి చేస్తారు. రాబోయే రోజుల్లో ఏవైనా మండలాల మార్పులు చేర్పులు జరిగితే, దానికి తగినట్లుగా జెడ్పీల పరిధిని కూడా మార్చుకునే సౌలభ్యం కల్పించారు. ఈ ప్రక్రియ అంతా సులువుగా సాగేందుకు జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, ఎంపీపీ అధికారులు నిరంతరం సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.