తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆగస్టు 15 నుంచి అన్ని ఎరువులు యాప్లోనే బుక్ చేయాలి..?
Farmer
రైతులు ఇకపై యూరియాతోపాటు కాంప్లెక్స్ ఎరువులను కూడా ఆన్లైన్ యాప్ Framework for Fertilizer Sale ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ, రైతులకు వారి సాగువిస్తీర్ణం మేరకు అవసరమైన ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఫెర్టిలైజర్ యాప్ను తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా జిల్లాల్లో అమలవుతున్నది. వికారాబాద్ జిల్లాలో ఈనెల 15 నుంచి అమలవుతుంది.
కొత్త ఎరువుల విధానంపై ఎరువుల డీలర్లకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జూమ్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఫెర్టిలైజర్ షాప్లు ఎలా వస్తాయి, యాప్లో ఎలా బుకింగ్ చేసుకోవాలి, డీలర్లు రైతులకు ఏవిధంగా సరఫరా చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
ఎఫ్ఎస్ఎస్ అనేది ఎరువుల విక్రయాలు, నిల్వలు, డిమాండ్, సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ. రాయితీ ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించే, అవసర మేరకు నిర్ణయించిన మోతాదులో అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ విధానంలో రైతు సాగు చేస్తున్న పంట విస్తీర్ణం ఆధారంగా, ఎకరానికి నిర్దేశించిన పరిమితితోనే రాయితీ ఎరువులనందజేస్తారు.
రైతుల ఆందోళన:
ఇప్పటికే యూరియా కోసం పడుతున్న కష్టాలు చాలవన్నట్లుగా, కొత్తగా దుక్కి మందులు, కాంప్లెక్స్ ఎరువులకు సైతం యాప్ తీసుకురావడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ఫోన్ లేని రైతులు, చదువురాని రైతులు ఇప్పటికే యూరియా బుకింగ్ కోసం ఇబ్బందులు పడుతుండగా, ఇక కొత్తగా అన్ని ఎరువులకు యాప్ బుకింగ్ పెట్టడం వల్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఎరువుల దుకాణాల ద్వారా ఎరువులు అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బుకింగ్ విధానం:
ముందుగా రైతులు తమ స్మార్ట్ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎఫ్ఎస్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో తెలుగు భాషను ఎంచుకునే అవకాశం ఉంది. యాప్లో రైతులు తమ ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేయాలి.
ఒకవేళ ఆన్లైన్లో భూమి వివరాలు కనిపించకుంటే, వాటిని స్వయంగా యాప్లో నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత అవసరమైన ఎరువు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏ డీలర్ వద్ద కొనుగోలు చేయాలనుకుంటున్నారో యాప్లోనే ఎంచుకుని బుకింగ్ పూర్తి చేయాలి.
రైతులు బుక్ చేసిన వివరాలన్నీ నేరుగా ఆ డీలర్ వద్ద ఉన్న పిఒఎస్ యంత్రంలో కనిపిస్తాయి. వాటి ఆధారంగా డీలర్ రైతులకు రాయితీ ఎరువులు అందజేస్తారు.
అన్ని ఎరువులు ఆ యాప్లోనే:
ఇకపై అన్ని ఎరువులు కొత్తగా ఎఫ్ఎస్ఎస్ యాప్ ద్వారానే సరఫరా అవుతాయి. యూరియా తరహాలోనే అన్ని ఎరువులనూ యాప్లోనే రైతులు బుకింగ్ చేసుకుని సంబంధిత ఫెర్టిలైజర్ షాప్ నుంచి తీసుకోవాలి. డీలర్లకు అవగాహన కల్పించడం, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కవిత తెలిపారు.
- అమిత్ షా ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
- తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆగస్టు 15 నుంచి అన్ని ఎరువులు యాప్లోనే బుక్ చేయాలి..?
- FCRA బిల్లును వ్యతిరేకిస్తాం… భయంతోనే మోదీ, షాలు సభకు రావడం లేదు: కెసి వేణుగోపాల్
- Adi Srinivas vs Bandi Sanjay: నీ బతుకంతా మత రాజకీయమే.. బండి సంజయ్ మీద విరుచుకుపడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- Pay More or Get Less: మరోసారి పెరగనున్న కిరాణా ఖర్చులు.. బిస్కెట్ల నుంచి టీ వరకు ధరలు బాదుడుకు రెడీ..కారణమేమిటంటే..