Skip to content
తెలంగాణ వార్తలు

Adi Srinivas vs Bandi Sanjay: నీ బతుకంతా మత రాజకీయమే.. బండి సంజయ్‌ మీద విరుచుకుపడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Prajapaksham 10 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Adi Srinivas vs Bandi Sanjay: నీ బతుకంతా మత రాజకీయమే.. బండి సంజయ్‌ మీద విరుచుకుపడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Adi Srinivas vs Bandi Sanjay

Adi Srinivas vs Bandi Sanjay: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన జీవితమంతా మతం పేరు చెప్పుకుని రాజకీయ ప్రయోజనాలు పొందడమే పనిగా పెట్టుకున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలిచే బోనాల ఉత్సవాలను కూడా బిజెపి నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం అత్యంత శోచనీయమని ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం బోనాలను ఎంతటి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిందో ప్రజలందరికీ తెలుసని.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తుచేశారు. బోనాల ఏర్పాట్లపై బండి సంజయ్ చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకిక రాజ్యంగ విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని, ప్రాచీన ఆలయాల వైభవాన్ని కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ఏకంగా రూ.2,500 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా:

ములవాడ రాజరాజేశ్వర ఆలయం: రూ.250 కోట్లు
బాసర సరస్వతి దేవి ఆలయం: రూ.225 కోట్లు
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం: రూ.351 కోట్లు
గోదావరి పుష్కరాల మౌలిక వసతులు: రూ.1,000 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

వీటికితోడు పశు సంరక్షణ కోసం మొయినాబాద్, వేములవాడలలో రూ.197 కోట్లతో అత్యాధునిక గోశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దేవాలయాల అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. సంజయ్‌కి నిజంగా భక్తి ఉంటే.. మాటలు చెప్పడం మాని కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.