Editorial: బంకీపూర్ ఉప ఎన్నిక ఏమి చెబుతోంది?
Prashant Kishor Victory
బీహార్ రాజధాని పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటర్ల తీర్పు బీజేపీ జాతీయ నాయకత్వం అహంభావంపై దెబ్బకొట్టింది. ఇది సాదాసీదా ఉప ఎన్నిక కాదు. భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాన్ని ఆ పార్టీ కోల్పోయింది. ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిశోర్, 1995 నుంచి బీజేపీ ఓటమి ఎరుగని బంకీపూర్ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. అనేక రాజకీయ పరిణామాల తర్వాత, 2024 అక్టోబర్ 2న జన సురాజ్ పార్టీని నెలకొల్పిన ప్రశాంత్ కిశోర్ తన ద్వారా తన పార్టీకి శాసనసభలో స్థానం సంపాదించారు.
గత సంవత్సరం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 230కి పైగా సీట్లలో పోటీ చేసి ఒక్క స్థానం చేజిక్కించుకోలేకపోయిన పార్టీకి, ఇంతలోనే ఈ మలుపు ఎలా వచ్చింది? బలమైన మధ్యప్రదేశ్లో దతియా అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తన స్థానాన్ని నిలుపుకోవటం విశేషమైతే, రెండు దశాబ్దాలకుపైగా బీజేపీ ఏలుబడిలో, ‘దేశానికి మోడల్’గా ఉన్న గుజరాత్లో మంజల్పూర్ అసెంబ్లీ సీటును బీజేపీ నిలబెట్టుకోగలిగినా, దాని మెజారిటీ తగ్గింది. 37.5 శాతం ఓట్లే పోలయ్యాయి. పట్టణాల్లో బీజేపీకి ఉన్న ఆధిక్యత మరోసారి రుజువైంది. వచ్చే ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నందున, ఈ ఉప ఎన్నికలో తగ్గిన మెజారిటీ బీజేపీకి చిన్నపాటి హెచ్చరికలాంటిది.
ఉప ఎన్నికకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, అది 1995 నుంచీ బీజేపీకి తిరుగులేని సీటు. బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తండ్రి నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా 1995 నుంచి ఆ సీటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2010 నుంచి నబీన్ వరుసగా ఐదు సార్లు ఎన్నికలు సహా గెలుచుకున్న సీటు. పార్టీ జాతీయ అధ్యక్షునిగా నియమించబడిన నబీన్ రాజ్యసభకు ఎన్నికై, అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయటం వల్ల ప్రస్తుత ఉప ఎన్నిక అవసరమైంది.
‘ఆ సీటులో బీజేపీ అభ్యర్థిగా ఎవరిని లేదా పిల్లిని పెట్టినా గెలుస్తుంది’ అని సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. (ఆ తర్వాత ఆ మాటలను తాను అనలేదని ఆయన సర్దుకున్నారు. అది వేరు విషయం.) బలమైన సీటును 19,324 ఓట్ల తేడాతో కోల్పోవటం బిహార్లోనే కాదు, వెలుపల కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. 2025 ఎన్నికల్లో పోలైన ఓట్లలో నబీన్కు 62.66 శాతం దక్కగా, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 34.40 శాతం ఓట్లే లభించాయి. పరిపూర్ణ సంఖ్యల్లో చూస్తే, విజేత ప్రశాంత్ కిశోర్కు 64,151 ఓట్లు రాగా, సిన్హాకు 44,827 ఓట్లు, ఆర్జేడీ అభ్యర్థికి 14,273 ఓట్లు లభించాయి.
రెండోది, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్తో అధికారం పంచుకుంటూ, దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి పదవి కోసం వేచి ఉన్న బీజేపీ, కొద్దిమాసాల క్రితం నితీశ్ కుమార్ను రాజ్యసభకు పంపి, తొలిసారి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక ఇది. అలాగే నీట్ ప్రశ్నాపత్రం, ఇతర ప్రశ్నాపత్రాల లీకేజీకి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ జన్ తరం విద్యార్థులు తమ ఆందోళనతో మోదీ ప్రభుత్వం మెడలు వంచిన అనంతరం జరిగిన ఉప ఎన్నిక ఇది.
పోలింగ్ 34 శాతమే (2025 ఎన్నికలకన్నా 7 శాతం తక్కువ) జరిగినందున, బీజేపీ సాంప్రదాయ ఓటర్లు చాలామంది ఓటింగ్కు రాలేదని విదితమవుతోంది. విద్యార్థుల ఆందోళన పట్ల మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన దాష్టీకానికి తల్లిదండ్రులుగా వారు ఆందోళన చెంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. జన్ ఉద్యమ ప్రభావం ఈ ఉప ఎన్నికల్లోనే కాదు, మున్ముందు కూడా ఉంటుందనటానికి ఇదొక సూచన.
అంతేకాదు, అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండాలని సిద్ధాంతీకరిస్తూ బీజేపీ అదే పనిగా ప్రచారం చేస్తుండగా, బిహార్లో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ఉండగా ఆ పార్టీకి ఓటమి సంభవించింది.
వర్గ విభజన, విధేయతకు నిలయమైన బిహార్లో ఈ ఉప ఎన్నిక ఆ విభజనను చెరిపివేసింది. ప్రశాంత్ కిశోర్కు అన్ని కులాలు, సముదాయాల్లో నుంచి తోడ్పాటు లభించింది. ఆయన పునాది స్థాయిలో ప్రచారంలో విద్య, ఉపాధి, సుపరిపాలన గురించి మాట్లాడారు.
‘బీజేపీ ఓడిపోతే, తమ వర్తనను, తమ లక్షణాన్ని, ప్రతిష్టను, పాలన తీరును బిహార్ ప్రజలు ఆమోదించటం లేదని ప్రభుత్వం అంగీకరించాలి’ అని ఎన్నికల ఆరంభంలో డిమాండ్ చేసిన ప్రశాంత్ కిశోర్, తన విజయం అనంతరం ముఖ్యమంత్రి మార్పు గురించి బీజేపీ నాయకత్వం ఆలోచించాలన్నారు.
ఒక ఉప ఎన్నిక బిహార్లో సామాజిక పొందికలను మార్చలేదు. అయితే, ఇదొక సూచిక. తాము ఏమి చేసినా చెల్లిపోతుందనే మోదీ అహంభావపూరిత వైఖరిపై ప్రజల్లో పునరాలోచన మొదలైందనటానికి ఇది సంకేతం. 2027 ఆరంభంలో జరిగే గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగలవని భావించటానికి వీల్లేదని ఈ ఉప ఎన్నికల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.