Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జెత్వానీ కేసులో అంతా తూచ్: సీఐడీ నివేదికతో తలకిందులైన సీన్… కూటమి సర్కార్‌కు ఐపీఎస్ ‌వర్గాల్లో అసంతృప్తి..

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
జెత్వానీ కేసులో అంతా తూచ్: సీఐడీ నివేదికతో తలకిందులైన సీన్… కూటమి సర్కార్‌కు ఐపీఎస్ ‌వర్గాల్లో అసంతృప్తి..

జెత్వానీ కేసులో అంతా తూచ్: సీఐడీ నివేదికతో తలకిందులైన సీన్... కూటమి సర్కార్‌కు ఐపీఎస్ ‌వర్గాల్లో అసంతృప్తి..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని, పోలీస్ వ్యవస్థను కుదిపేసిన ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో విజయవాడ సీఐడీ కోర్టుకు సమర్పించిన సవరించిన ఛార్జ్‌షీట్ ఒక పెద్ద ఊహించని మలుపును తీసుకువచ్చింది. ఇప్పటివరకు జెత్వానీని అమాయక బాధితురాలిగా చిత్రీకరిస్తూ సాగిన కథనాలన్నీ “తూచ్” అనేలా సీఐడీ సంచలన నిజాలను బయటపెట్టింది. ఈ కేసులో జెత్వానీనే ప్రధాన నిందితురాలు (A-1) అని పేర్కొంటూ, ఆమె వైసీపీ నాయకుడు, వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేసి, రూ. 1.32 కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలతో సహా సీఐడీ స్పష్టం చేసింది.

గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ అంశంపై టీడీపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైసీపీ అగ్రనేతలు, వైఎస్సార్‌సీపీకి మద్దతుగా కొందరు ఉన్నతాధికారులు కలిసి జెత్వానీని అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారని టీడీపీ గళమెత్తింది. జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదులను ఆధారం చేసుకుని, ఈ కేసు వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ముగ్గురు ఐపీఎస్ అధికారులను (పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ) ప్రభుత్వం సస్పెండ్ చేయడం, అనేకమంది పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రాష్ట్రంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.

అయితే, స్వయంగా కూటమి ప్రభుత్వ పరిధిలోని సీఐడీ చేపట్టిన సమగ్ర విచారణలో జెత్వానీ అసలు రంగు బయటపడటంతో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. 2009 నుంచే “నటాషా” అనే పేరుతో విద్యాసాగర్‌కు పరిచయమైన ఆమె, వారి వ్యక్తిగత ఫొటోలను చూపిస్తూ నిరంతరం బెదిరింపులకు పాల్పడిందని సీఐడీ వెల్లడించింది. రేప్ కేసులు పెడతానని, కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపుతానని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాల ద్వారా కోట్లలో డబ్బులు గుంజినట్లు బ్యాంకింగ్, కాల్ డేటా సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. మొదట్లో వేధింపులకు గురైన బాధితురాలిగా ప్రచారంలోకి వచ్చి సానుభూతి పొందిన జెత్వానీ, ఇప్పుడు వ్యూహాత్మకంగా కోట్లు కొల్లగొట్టిన కిలాడీగా సీఐడీ ఛార్జ్‌షీట్‌తో తేలిపోయింది.

ఈ హఠాత్ పరిణామంతో ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంలో తీవ్ర అసంతృప్తి పొడసూపుతోంది. కేవలం ఒక మహిళ చేసిన ఆరోపణలను, రాజకీయ ప్రయోజనాల కోసం నిజానిజాలు తేలకముందే నమ్మి సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడంపై ఐపీఎస్ లబీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రాథమిక విచారణ సరిగ్గా జరగకుండానే టీడీపీ తొందరపడి వైసీపీపై విమర్శలు చేయడం, అధికారులపై వేటు వేయడం వల్ల పోలీస్ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క సీఐడీ రిపోర్టుతో టీడీపీ చేసిన పాత ఆరోపణలన్నీ తుస్సుమనడమే కాకుండా, పరిపాలనాపరంగా కూటమి ప్రభుత్వం సొంత నిర్ణయాల వల్లే స్వయంగా ఇరకాటంలో పడిందనే చర్చ పొలిటికల్, బ్యూరోక్రటిక్ సర్కిల్స్‌లో జోరందుకుంది.