Skip to content
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ – వీబీజీ రాంజీపై అమలుపై నిర్ణయం, సహా కీలక నిర్ణయాలు ఇవే

Prajapaksham 02 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ – వీబీజీ రాంజీపై అమలుపై నిర్ణయం, సహా కీలక నిర్ణయాలు ఇవే

Revanth Reddy meeting

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో నేడు క్యాబినెట్ భేటీ జరిగింది ఈ సమావేశంలో విబిజిరాంజి, మూసి ప్రక్షాళన, ప్రభుత్వ టీచర్లకు అల్పాహారం వంటి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా బ్రీఫింగ్ చేసి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. తొలిసారిగా పేపర్ లెస్ క్యాబినెట్ సమావేశం జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కూడా విబిజిరాంజీ పథకం అమలు చేయాలని పేర్కొన్నారు.

క్యాబినెట్ సమావేశంలోని ముఖ్యంశాలు ఇవే…

  1. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టం రాష్ట్రంలో అమలు చేసే అంశంపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన ఈ చట్టంలో పొందుపరిచిన నిబంధనలపై మంత్రివర్గం నిరసన తెలిపింది.
  2. కూలీలకు ఉపాధి భరోసా కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో మార్పులు చేయవద్దని జనవరి లోనే అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని చర్చించింది. మరోసారి తమ నిరసనను కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది.
  3. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం మోపే నిర్ణయాన్ని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్షంగా వీబీ జీ రామ్ జీ పధకం అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ చేసిన పలు సిఫారసులను మంత్రివర్గం చర్చించింది.
  4. ఇతర రాష్ట్రాలన్నీ కొత్త చట్టం ఆమోదం తెలిపాయా.. లేదా అధికారులను అడిగి తెలుసుకుంది. అన్ని రాష్ట్రాలు కొత్త చట్టం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
  5. గత్యంతరం లేని పరిస్థితిలో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఆలోచనతో.. ఈ కొత్త చట్టాన్ని 2026 జులై 1 నుంచి రాష్ట్రంలో అమల్లోకి తెచ్చేందుకు నోటిఫికేషన్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  6. కానీ న్యాయపరంగా పోరాటం చేయాలని, కొత్త చట్టం లో విధించిన నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ లోనూ కేంద్రం తీరును నిలదీయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
  7. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో అందించే అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజ‌నాన్ని విద్యార్థుల‌తో పాటు ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్లు, సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యించింది.
  8. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతో పాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగా రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకం వర్తింపజేయనుంది.
  9. కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. స‌న‌త్ న‌గ‌ర్‌, ఎల్‌.బి.న‌గ‌ర్‌, అల్వాల్ టిమ్స్ తో పాటు వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులు మంజూరు చేసింది. రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు వీలుగా మొత్తం 6,278 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,494 రెగ్యుల‌ర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, 4,235 ఔట్ సోర్సింగ్ పోస్టులకు అనుమతించారు. ఈ ఆసుప‌త్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవ‌ల‌కు సీఎం రిలిఫ్ ఫండ్ నుంచి LOC లు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.
  10. మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగంగా ఫేజ్‌- I పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కిలోమీట‌ర్ల పొడవునా అభివృద్ధికి రూ.7,345.12 కోట్ల విలువైన ప‌నుల మంజూరుకు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హిమాయ‌త్ సాగ‌ర్ నుంచి ఈసా… ఉస్మాన్ సాగ‌ర్ నుంచి మూసా ప్ర‌వాహాలు ప్రారంభ‌మ‌య్యే చోటు నుంచి బాఫూఘాట్ వరకు ఈ ప‌నులు చేప‌డ‌తారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌నులు… నిర్వ‌హ‌ణ కోసం నూత‌నంగా 147 పోస్టుల క్రియేష‌న్‌తో పాటు ఇత‌ర శాఖ‌ల నుంచి అవ‌స‌ర‌మైన సిబ్బంది డిప్యూటేష‌న్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  11. వ‌రంగ‌ల్ జిల్లా నెక్కొండ మండ‌లం బొల్లికుంట గ్రామంలో నిత్యావ‌స‌ర వ‌స్తువులు గోదాముల నిర్మాణానికి 50 ఎక‌రాల‌ను, రంగారెడ్డి జిల్లా క‌డ్తాల్ మండ‌లం క‌ర్కాల‌ప‌హాడ్ గ్రామంలో 10 ఎక‌రాల‌ను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (Telangana state Warehousing corporation (TGSWC)) కు మార్కెట్ రేట్ ప్ర‌కారం కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  12. జవహర్ నవోదయ విద్యాలయాలకు రెండు చోట్ల ప్రభుత్వం స్థలం కేటాయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లి గ్రామంలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడ‌లో 19.12 ఎక‌రాల‌ ప్రభుత్వ భూమిని క్యాబినెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా చ‌ల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాల‌ని క్యాబినెట్ నిర్ణ‌యించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *