ఓటు హక్కును రక్షించుకునేందుకు SIR పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్
Professor Nageswar Calls for Awareness on ‘SIR’ to Protect Voting Rights
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ద్వారా ప్రజలకు లేకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని పలువురు వక్తలు అన్నారు. ఓటు హక్కును రక్షించుకునేందుకు ‘సర్’ పట్ల వార్డు, గ్రామ స్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్, బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివ రావు అధ్యక్షతన సోమవారం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు జరిగింది.
ఈ సదస్సులో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ తరహా నాన్ జూయిస్ బతక కూడదనే దోరణిని భారతదేశంలో కూడా తీసుకొస్తున్నారని విమర్శించారు. గాజాలో 70 లక్షలమందిని చంపేశారన్నారు. సౌత్ ఆఫ్రికాలో 70-80 శాతం భూములు తెల్లవారి అధినంలో ఉంటాయని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలో దిగారని, అదే తరహాలో భారతదేశంలో కూడా ఆస్మదీయులైన ఓటర్లను తయారు చేసుకున్నారని విమర్శించారు.ఎన్నికల్లో పోటీ చేయాలంటే రిటర్నింగ్ అధికారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, ఇందుకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సంఘటననే ఉదాహరణగా గుర్తు చేశారు.తమిళనాడులో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ అనేక అడ్డంకులను సృష్టించారన్నారు. ప్రశ్నిస్తే బొద్డింకలు అని అంటారన్నారు.
చట్టాలపై పౌరులకు సంపూర్ణ అవగాహన అవసరం: మాడభూషి శ్రీధర్
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ నాన్ ఆప్లికేబుల్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారన్నారు. నాన్ ఆప్లికేబుల్ అని అంటే ఇక పోటీ చేయడానికి అవకాశం ఉండబోదని, ఓటరు జాబితాలో కూడా ఇదే మాదిరిగా ఓట్లను తొలగింపు ప్రక్రియ చేస్తున్నారన్నారు. ఓట్లు లేని వాళ్లు ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. ఆధార్ ఉన్నంత మాత్రాన సిటీజన్ కాదని, పాస్ కూడా ఉండాలని, పాస్ పోర్ట్ ఉంటే కూడా కాదని, ఓటు హక్కు ఉండాలని, ఇవన్ని లేకుంటే పౌరసత్వం రాని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓటు పవర్ మారిందని, ఓటు ఎటు జారీ పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.