సువర్ణాక్షర లిఖితం… తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
ప్రపంచ చరిత్రలో వివిధ సందర్భాలలో అనేక ఉద్యమా లు, ఆందోళనలు, నిరసనలు, నిర్బంధాలకు, అణిచివేత కు వ్యతిరేకంగా ఉద్భవించాయి. వీటిలో కొన్ని పోరాట విజయాలను సాధించాయి. అటువంటి వాటిలో సువర్ణక్షరాలతో లిఖించదగినది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన ఈ పోరాటం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు, తిరుగుబాట్లు పురుడు పోసుకునేందుకు కారణమైంది.
78 ఏళ్ల తర్వాత ఈ ఉద్యమాన్ని మననం చేసుకుంటున్నామంటే ఈ ఉద్యమం వెనుక ఉన్న పోరాటాలు, అసామాన్యమైన త్యాగాలు వాటిద్వారా సాధించిన విజయాలే కారణం. సాయుధ తెలంగాణ పోరాటం అంటే రాజ్యాల కోసం, సంపద కోసం సాగిన ఉద్యమం కాదు. నిర్బంధాలు, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సామాన్యులు సాయుధులై పోరాడిన ఒక మహత్తర ఘట్టం.
ఒకప్పుడు చరిత్ర అంటే రాజులు, రారాజులు, వారి రాణుల భోగ విలాసాలు, దురాక్రమణలు, యుద్ధాలు మాత్ర మే. కానీ ఒక బలవంతుడైన రాజును సామాన్యులు మట్టి కరిపించి ఒక నూతన చరిత్రకు ఊపిరి పోసిన మహోజ్వల పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.
ఈ పోరాటంలో సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. సామాన్యులు, రైతులు, కవు లు, కళాకారులు, మేధావులు ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అందుకే ఈ పోరాటం ఇంత ఘన చరిత్రను సంతరించుకున్నది.
ఇప్పుడు కొందరు మతోన్మాదులు వక్రీకరిస్తున్నట్లుగా ఇది ప్రాంతీయ ఉద్యమం కాదు. ఒక మతపరమైన ఉద్యమం కాదు. జాతీయోద్యమ ప్రేరణతో సాగిన పోరాటమే సాయుధ తెలంగాణ పోరాటం. ఈ పోరాటానికి దేశంలో అంతకు ముందు జరిగిన ప్రజా ఉద్యమాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సాగించిన అనేక ఉద్యమాలు ప్రేరణగా నిలిచాయి.
నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో తెలంగాణలో ఒక నిరంకుశ పాలన సాగుతుంది. ప్రజలు స్వేచ్ఛగా జీవించలేని ఒక భయానక పరిస్థితి ఉంది. రాజుకు తోడు గ్రామాల్లోని దొరలు, దేశ్ముఖ్లు, దేశ్పాండేలు, జమీందార్లు, జాగీర్దార్లు, ఇనామ్దార్లు, పటేల్, పట్వారీల దోపిడీ, దౌర్జన్యాలు శృతిమించాయి.
నిజాంకు వ్యతిరేకంగా అంతకు ముందు పలుచోట్ల స్థానికంగా ఉద్యమాలు రగిలిన వాటిని నిజాం సైన్యాలు అణిచివేశాయి. అప్పటికే కొందరు నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించారు.
నిజాం ఏలుబడిలోని ప్రజలు విముక్తి కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ 11, సెప్టెంబర్ 1947న ఒక చారిత్రక ప్రకటన చేశారు.
సమయం ఆసన్నమైంది. మనం ముందుకు.. మున్ముందుకు పోవాల్సిన సమయం వచ్చింది. నిజాం గద్దెను కూల్చడానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గమన్నారు. ఈ ప్రభుత్వాన్ని తలక్రిందులు చేయాలి. ఒక పక్క సహా య నిరాకరణ, మరో పక్క సాయుధ పోరాటం కొనసాగాలన్న వారి పిలుపుకు యావత్ తెలంగాణ స్పందించింది.
అప్పటికే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి తెలంగాణ మాత్రం నిజాం ఏలుబడిలో ఉండడంతో ఈ పిలుపుకు ప్రజలు స్పందించారు. ఒక నూతనోత్సా హం పెల్లుబికింది. అయ్య నీ బాంచన్ అన్న వాళ్లంతా సాయుధ సైనికులు అయ్యారు. కర్ర, గొడ్డలి, బరిసె, వడిసెల, చేతిలో రాయి ఏది అందితే అది తీసుకుని సమస్త ప్రజానీకం సాయుధ పోరాట బాట పట్టింది.
ఇదే సమయంలో కవులు తమ కలాలకు పదును పెట్టారు. గాయకులు గొంతెత్తి పాడారు. పాత్రికేయులు తమ పత్రికలలో సాయుధ తెలంగాణ పోరాట అవసరాన్ని, పోరాటం జరుగుతున్న తీరును సవివరంగా ప్రజలకు అందించారు. మొత్తంగా ప్రజల్లో ఒక విప్లవ జ్వాల రగిలింది.
అప్పుడే సుద్దాల హన్మంతు
విప్లవ శక్తి రగులుకొన్నది
రణభేరీ మ్రోగింది తెలుగోడా
రావోయి ముందుకు మొనగాడా
అంటూ ఒక విప్లవ గేయాన్ని అలపించి ప్రజలతో గొంతు కలిపాడు.
కొండేపూడి లక్ష్మినారాయణ అదే సమయంలో
నిజాం అనగా ఎంతరా
వాడి తాహత్ ఎంతరా
కాసింరజ్వీ ఎంతరా
వాని బిసాదెంతరా
అందరం కలిసి తంతే
అంతుదొరకకుండురా
అన్న గేయం ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపింది.
అప్పటి ఉమ్మడి ఖమ్మంజిల్లాకు చెందిన దాశరథి
అరుణ అరుణ తరణి కొరకు
చెలరేగిన ప్రజల వాంఛ
పురికొల్పిన పొంగులతో
పోతున్నాం యుద్ధానికి
రణ రంగపు విపణి వీధి
లక్షలాది ప్రాణాలను
పైసలుగా పారబోసి
స్వాతంత్య్రం కొనితెస్తాం
అంటూ దాశరథి రాసిన పాట జనం గొంతుకల్లో మారుమ్రోగింది.
మరో పక్క ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు సోయబుల్లాఖాన్ రజాకారుల రాక్షసాల ను ఎండగడుతూ కలాన్ని కలవలం చేశాడు.
సబ్బండ వర్గాలు పోరాటంతో నిజాం రాజు తలవంచక తప్పలేదు. భారత సైన్యాలు నిజాంను లొంగదీసుకున్నాయని ప్రచారం చేసినా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మరొకరు కథనాలు వినిపించినా ఇప్పటి నేతలు కొందరు నిజాం ముస్లిం కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసి నా వాస్తవం మాత్రం నిజాం ను గద్దె దింపింది సాయుధ తెలంగాణ పోరాటమే.
ఆధారాలు లేని, నమ్మశక్యం కానీ వక్రీకరించే మాటలతో రాజకీయ లబ్ది కోసం కొందరు చేస్తున్న ప్రకటనలు నాటి వీరుల త్యాగాలను అపహాస్యం చేయడమే.
సాయుధ తెలంగాణ పోరాటం అనేక ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ఆ స్ఫూర్తితో ప్రజా ఉద్యమ నిర్మాణం జరగాల్సి ఉంది. 150 కోట్లకు చేరువవుతున్న భారతదేశ జనాభా ఎనిమిది దశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.
ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని నేతలు ఊదరగొడుతున్న సమయంలో రెండు దశాబ్దాలుగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. ప్రజల అవసరాలను తీర్చలేని స్థితికి పాలకులు చేరుకుంటున్నారు.
ఇప్పుడు దేశంలో పాలన అంటే సంపన్న వర్గాల కోసం సాగేదే అన్న భావన రోజురోజుకు బలపడుతుంది. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి. మరో పక్క మేధో వలస కొనసాగుతుంది. ఉపాధి, ఉద్యోగ రంగాలు వట్టిపోతున్నా యి. యాంత్రీకరణ చిన్న పరిశ్రమలను కబళించేసింది. కార్పొరేట్ రంగం ఇప్పుడు బుసలు కొడుతుంది.
ఇటువంటి సమయంలో సాయుధ తెలంగాణ 78వ వారోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ చరిత్రలో ప్రజా పోరాటాలు లేకుండా ప్రజల అవసరాలను నెరవేర్చిన ఘటనలు లేవంటే అతిశయోక్తి కాదు.
అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం కొన్ని ఉచిత పథకాలను ప్రవేశపెట్టవచ్చు. లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయాలి కాబట్టి చేసి ఉండవచ్చు. కానీ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగడం లేదన్నది వాస్తవం.
ఎప్పుడో తెలంగాణ కవులు రచించి గాయకులు అలపించినట్లుగా
కొమరన్నకు వారసులు / కొరన్న, మంగన్నలు
తెలంగాణ పల్లెల్లో మేలుకునే ఉన్నారు
సై అంటే సై అంటారు
అన్నట్లుగా ప్రజల అవసరాలను నెరవేరుస్తూ హక్కుల సాధన కోసం జరిగే ప్రజా ఉద్యమాల కోసం పునీతమైన ఈ తెలంగాణ గడ్డ ఎప్పుడు ఎదురు చూస్తునే ఉంటుంది.
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజా ఉద్యమం రగిలిన ప్రతిసారి ఈ గడ్డ మీద అది విజయాన్ని సాధించింది. ఇప్పుడు తెలంగాణ పోరాట స్ఫూర్తితో మరో ప్రజా ఉద్యమం, ప్రజల హక్కుల సాధన, పెరుగుతున్న ఆర్థిక అంతరాలకు నిరసనగా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పురుడు పోసుకోవాల్సి ఉంది.
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు మరో పోరాటం పురుడు పోసుకునేందుకు స్ఫూర్తిగా నిలవాలని, నిలుస్తాయని ఆశిద్దాం.
-ఏనుగు వెంకటేశ్వరరావు