Skip to content
జాతీయం వార్తలు

Vande Mataram Row: జైలుకు పంపినా, ఉరి తీసినా రెండు చరణాలే పాడతాం.. వందేమాతరం గేయంపై బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Prajapaksham 18 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Vande Mataram Row: జైలుకు పంపినా, ఉరి తీసినా రెండు చరణాలే పాడతాం.. వందేమాతరం గేయంపై బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Hariprasad on Vande Mataram

కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ 2026 ఆగస్టు 18న మాట్లాడుతూ.. కాంగ్రెస్ వందేమాతరం రెండు చరణాలను మాత్రమే పాడుతుందని, జైలుకు పంపినా లేదా ఉరితీసినా తమ వైఖరి మారదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వందేమాతరం పూర్తి గీతం పాడాలన్న అంశంపై కాంగ్రెస్-బీజేపీ మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో వచ్చాయి

Vande Mataram Row: వందేమాతరం ఆలపించే విషయంలో కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ స్పష్టం చేశారు. తమను జైలుకు పంపినా లేదా ఉరి తీసినా వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడతామని ఆయన తేల్చిచెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమం కాలం నుండి కాంగ్రెస్ పాటిస్తున్న ఈ సాంప్రదాయంలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ వివాదం వెనుక భారతీయ జనతా పార్టీ (BJP), ఆర్‌ఎస్‌ఎస్ (RSS) కుట్ర ఉందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ జాతీయ గేయాన్ని అడ్డుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను హరిప్రసాద్ పూర్తిగా తిరస్కరించారు. వందేమాతరాన్ని తప్పుగా ఆలపిస్తున్న తీరును మాత్రమే సోనియా గాంధీ సరిదిద్దాలని సూచించారని వివరించారు. అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వయస్సు 84 సంవత్సరాలని, ఆయన కాళ్ల నొప్పులతో ఎక్కువ సేపు నిలబడలేరనే ఉద్దేశంతో ఆయన కోసం కుర్చీ తీసుకురావాలని మాత్రమే సోనియా గాంధీ కోరారని స్పష్టతనిచ్చారు.

దేశభక్తి, జాతీయ గీతాల గురించి కాంగ్రెస్‌కు పాఠాలు చెప్పే అర్హత బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తమ ప్రార్థనా గీతం ‘నమస్తే సదా వత్సలే’ తర్వాత ఎన్నిసార్లు వందేమాతరం లేదా జాతీయ గీతం పాడారో చెప్పాలని సవాల్ విసిరారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ వ్యతిరేక వైఖరిని అవలంబించిందని ఆరోపిస్తూ, నాటి ‘వందేమాతరం’, ‘ఇంకిలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలను వారు ఎప్పుడైనా ఆమోదించారా అని ప్రశ్నించారు. ఇక రాహుల్ గాంధీ వందేమాతరం పాడబోరని ప్రచారంలో ఉన్న వీడియోపై తనకు స్పష్టమైన అవగాహన లేదని పేర్కొన్న హరిప్రసాద్.. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని పునరుద్ఘాటించారు.