Skip to content
జాతీయం వార్తలు

అందుబాటులో ‘విజ్ఞానం’

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
అందుబాటులో ‘విజ్ఞానం’

Knowledge at Your Fingertips: 'Vignanam' Now Accessible

అంతర్జాతీయ బుక్‌ఫెయిర్‌లో ఆకట్టుకుంటున్న పుస్తకాల్లో ప్రధానంగా ‘యు మస్ట్‌ లివ్‌’ అనే పాలస్తీనా కవుల సమకాలీన కవితల సంకలనాన్ని పేర్కోవాలి. యుద్ధం, ఆక్రమణ, నిరాశ్రయ జీవితం, జ్ఞాపకాలు, ప్రతిఘటన, ఆశ వంటి అంశాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. వ్యక్తిగత బాధను సామూహిక అనుభవంతో ముడిపెట్టి, పాలస్తీనా ప్రజల అస్తిత్వ పోరాటాన్ని కవిత్వం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే ముఖ్యమైన సంకలనం. అదే విధంగా, భారతీయ ఆంగ్ల కవి బిష్ణు మొహాపాత్ర రచించిన ‘రెయిన్‌ ఇన్కార్నేషన్స్‌’ కవితా సంపుటి ప్రకృతి, వర్షం, కాలం, జ్ఞాపకాలు, మానవ సంబంధాల చుట్టూ తిరుగుతుంది. వర్షాన్ని కేవలం ప్రకృతి సంఘటనగా కాకుండా పునర్జన్మ, మార్పు, ఆత్మపరిశీలనకు ప్రతీకగా చూపించడం ఈ కవితల ప్రత్యేకత. ఆఫ్రికన్‌- కవయిత్రి నిక్కీ జియోవన్ని రాసిన ‘మేక్‌ మి రైన్‌’ కవితా సంకలనం ప్రేమ, జాతి వివక్ష, స్వేచ్ఛ, మహిళా అనుభవాలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తిగత అనుభూతులను రాజకీయ చైతన్యంతో మేళవిస్తూ, ఆశావాదం, ప్రతిఘటనను కవిత్వ రూపంలో వ్యక్తపరుస్తుంది. ఇక, ప్రయోగాత్మక కవి ఎ/నిల్‌ (అ/నిల్‌) రచించిన ‘ది ఆబ్సెంట్‌ కలర్‌’ సంపుటి నగర జీవితం, గుర్తింపు, జ్ఞాపకాలు, శూన్యత, భాష పరిమితులను పరిశీలిస్తుంది. ఆధునిక జీవితంలోని ఒంటరితనం, విభజన, అంతర్ముఖ అనుభవాలను సంకేతాత్మక భాష లో వ్యక్తీకరించిన కవితలు ఇందులో ఉంటాయి. రణ్జిత్‌ హోస్కోటే రాసిన ‘ఐస్‌లైట్‌’ సంకలనంలో చరిత్ర, సంస్కృతి, పురాణం, కళ, వలస జీవితం, జ్ఞాపకాలు ప్రధాన అంశాలు. ఇందులో ప్రపంచ సంస్కృతుల మధ్య సంబంధాలు, కాలం ప్రభావం, వ్యక్తి అంతర్మథనం వంటి విషయాలు సున్నితమైన రూపకాలతో వ్యక్తమవుతాయి. మేధోపరమైన, బహుస్థర అర్థాలతో కూడిన కవితా సంపుటిగా ఇది గుర్తింపు పొందింది. విక్రమ్‌ సేథ్‌ రచించిన ‘ఆల్‌ యు హూ స్లీప్‌ టునైట్‌’ అనే ప్రసిద్ధ కవితా సంపుటి సరళమైన భాషలో లోతైన భావాలను వ్యక్తపరుస్తుంది. ప్రేమ, ఒంటరితనం, మానవ సంబంధాలు, కాలం, ప్రపంచవ్యాప్తంగా మనుషులను కలిపే అనుభూతులు ఇందులో ప్రధానాంశాలు. సంప్రదాయ ఛందస్సును ఆధునిక భావాలతో సమన్వయం చేయడం ఈ కవితల ప్రత్యేకత. గోపికా జడేజా రచించిన ‘వాట్‌ పార్వతి డస్‌ నాట్‌ సే’ కవితా సంపుటి పురాణ పాత్ర పార్వతిని ఆధునిక మహిళా దృక్కోణంలో పునర్నిర్వచిస్తుంది. స్త్రీ స్వరం, మౌనం, శక్తి, ప్రేమ, ఆత్మగౌరవం వంటి అంశాలను స్త్రీవాద దృష్టితో పరిశీలిస్తుంది. పురాణాన్ని సమకాలీన జీవితంతో అనుసంధానించే ప్రయత్నం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. తాన్యా సింగ్‌ కలం నుంచి జాలువారిన ‘బ్లూ’ కవితా సంపుటిలో ‘నీలం‘ అనే రంగు ఒక భావప్రతీకగా మారుతుంది. ఒంటరితనం, ఆశ, నష్టం, ప్రేమ, స్వీయ అన్వేషణ వంటి భావోద్వేగాలను సున్నితమైన భాషలో వ్యక్తపరుస్తుంది. చిన్నచిన్న జీవిత క్షణాల ద్వారా పెద్ద భావ ప్రపంచాన్ని నిర్మించే ఆధునిక కవిత్వానికి ఇది ఒక ఉదాహరణ. అమెరికన్‌ కవి, రచయిత చార్లెస్‌ బుకోవ్‌స్కీ చివరి దశలో రాసిన కవితల సంకలనం ‘ది లాస్ట్‌ నైట్‌ ఆఫ్‌ ది ఎర్త్‌’. వృద్ధాప్యం, మరణం, ఒంటరితనం, మద్యం, నగర జీవితం, ప్రేమ, రచయిత జీవిత అనుభవాలు ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. ఎలాంటి అలంకారాలు లేకుండా నేరుగా, నిజాయితీగా జీవితం గురించి చెప్పే బుకోవ్‌స్కీ ప్రత్యేక శైలి ఈ గ్రంథమంతా కనిపిస్తుంది. జీవితంలోని కఠిన వాస్తవాలను కూడా వ్యంగ్యంతో, హాస్యంతో, తాత్విక దృష్టితో చిత్రించడం ఈ కవితల విశేషం. కాగా, వివిధ దేశాలు, కాలాలకు చెందిన ప్రముఖ కవుల వంద కవితల సంకలనం ‘100 పోయెమ్స్‌ ఆర్‌ నాట్‌ ఎనఫ్‌’. ప్రేమ, ప్రకృతి, యుద్ధం, మానవ జీవితం, మరణం, స్వేచ్ఛ, ఆధ్యాత్మికత వంటి అనేక భావ ప్రపంచాలను పరిచయం చేస్తుంది. ప్రపంచ కవిత్వ వైవిధ్యాన్ని ఒకే గ్రంథంలో ఆస్వాదించాలనుకునే పాఠకులకు ఇది మంచి ఎంపిక. మంచి రచనలకు, అర్థవంతమైన కవితలకు పట్టం కట్టే పాఠకులు తప్పక చదవాల్సిన పుస్తకాల జాబితాలో ఇవి చేరుతాయి. అంతర్జాతీయ స్థాయిలోనేగాక, వివిధ దేశాల్లో నగర, పట్టణ, గ్రామ స్థాయిల్లో కూడా ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అత్యవసరంగా మారుతున్నది. సాహిత్యాభిలాషనను పెంచడంతోపాటు, మంచి రచనలను, రచయితలను ప్రోత్సహించడానికి ఇదో ఉత్తమమైన మార్గం.

ట్యాగ్‌లు: Knowledge