Skip to content
జాతీయం వార్తలు

Criminalisation of Politics: సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు.. 14 మంది సీఎంలపై క్రిమినెల్ కేసులు.. షాకిస్తున్న ప్రజాప్రతినిధుల కేసులపై తాజా గణాంకాలు

Prajapaksham 18 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Criminalisation of Politics: సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు.. 14 మంది సీఎంలపై క్రిమినెల్ కేసులు.. షాకిస్తున్న ప్రజాప్రతినిధుల కేసులపై తాజా గణాంకాలు

లఖింపూర్ హింసాకాండ కేసులో.. ఆశిష్ మిశ్రా బెయిల్ షరతుల సడలింపునకు 'సుప్రీం' నో

2023 ADR డేటా ప్రకారం కేరళ ఎంపీల్లో 73 శాతం, తెలంగాణ ఎంపీల్లో 50 శాతం మంది తమ స్వీయ అఫిడవిట్లలో క్రిమినల్ కేసులను ప్రకటించారు. 2025లో సుప్రీంకోర్టుకు సమర్పించిన మరో నివేదికలో కేరళకు చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలలో 19 మంది, తెలంగాణకు చెందిన 17 మందిలో 14 మంది క్రిమినల్ కేసులు ప్రకటించినట్లు వెల్లడైంది.

Criminalisation of Politics: భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఏటా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పార్లమెంట్‌లోని ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న విచారణలను వేగవంతం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్ ఈ వాస్తవాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా ప్రఖ్యాత ఎన్నికల సంస్కరణల సంస్థ ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ADR) గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను అత్యున్నత న్యాయస్థానం ముందుంచారు.

ఈ అఫిడవిట్ ప్రకారం.. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో ఏకంగా 251 మంది (సుమారు 46 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారికంగా స్వయం ప్రకటన చేశారు. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే, ఈ 251 మందిలో 170 మందిపై ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. అలాగే 233 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో 75 మందిపై (32 శాతం) క్రిమినల్ కేసులు నమోదు కాగా.. వారిలో 40 మంది తీవ్రమైన నేర విచారణలను ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు 2018 నుండి ఈ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ.. ఫలితాల్లో పెద్దగా మార్పు రాలేదని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు విచారణ దశలోనే పీటముడి వేసుకుని ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

ఈ నివేదికలోని రాష్ట్రాల వారీ డేటా ప్రజాప్రతినిధుల నేర చరిత్ర తీవ్రతను స్పష్టం చేస్తోంది. కేరళ రాష్ట్రానికి చెందిన 20 మంది ఎంపీలలో ఏకంగా 19 మంది (95 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడి 17 మంది ఎంపీలలో 14 మంది (82 శాతం) పై కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో 76 శాతం, జార్ఖండ్‌లో 71 శాతం, తమిళనాడులో 67 శాతం మంది ఎంపీలు నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలలో కూడా దాదాపు 50 శాతం మంది ప్రజాప్రతినిధులపై వివిధ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలోని 28 రాష్ట్రాలకు గాను సగం మంది, అంటే 14 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ పేర్కొంది. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయని నివేదిక తెలిపింది. పశ్చిమ బెంగాల్ నాయకుడు సువేందు అధికారిపై 29 కేసులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

కోర్టుల విచారణలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రజాప్రతినిధుల కేసుల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను మాత్రమే ప్రాధాన్యత క్రమంలో విచారించాలని, అవి పూర్తయ్యే వరకు ఇతర సాధారణ కేసులను చేపట్టకూడదని కోరారు. అలాగే ఏ కేసులోనైనా చార్జిషీట్ (Chargesheet) ఖరారైన నాటి నుంచి సరిగ్గా ఒక ఏడాది వ్యవధిలో విచారణను పూర్తి చేసేలా ఆయా రాష్ట్రాల హైకోర్టులు నెలవారీ పర్యవేక్షణ (Monthly Monitoring) జరపాలని ఆయన సిఫార్సు చేశారు. గతంలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కేసుల పరిష్కారంలో పురోగతి లేకపోవడం చట్టసభల పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.