Skip to content
ప్రపంచం వార్తలు

Sable Island: సేబుల్ ఐలాండ్.. ఈ దీవిలో మనుషులు కాదు, గుర్రాలే రాజులు.. 350కి పైగా ఓడలను ముంచేసిన అట్లాంటిక్ స్మశానం మిస్టరీ ఇదే..

Prajapaksham 19 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Sable Island: సేబుల్ ఐలాండ్.. ఈ దీవిలో మనుషులు కాదు, గుర్రాలే రాజులు.. 350కి పైగా ఓడలను ముంచేసిన అట్లాంటిక్ స్మశానం మిస్టరీ ఇదే..

Sable Island: సేబుల్ ఐలాండ్.. ఈ దీవిలో మనుషులు కాదు, గుర్రాలే రాజులు.. 350కి పైగా ఓడలను ముంచేసిన అట్లాంటిక్ స్మశానం మిస్టరీ ఇదే..

Sable Island: కెనడాలోని నోవా స్కోటియాకు ఆగ్నేయంగా సుమారు 300 కిలోమీటర్ల దూరంలో.. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డున సేబుల్ ఐలాండ్ అనే ఒక అత్యంత అసాధారణమైన ప్రకృతి దృశ్యం దాగి ఉంది. ఇసుకతో ఏర్పడిన ఈ సన్నని అర్ధచంద్రాకార ద్వీపంలో మనుషులు ఎవరూ ఉండరు. ఇక్కడ రోడ్లు గానీ, శాశ్వత నివాసాలు గానీ లేవు. సుమారు 42 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత పొడవైన, సన్నని ఇసుక ద్వీపాలలో ఒకటిగా చరిత్రకెక్కింది. శక్తివంతమైన అట్లాంటిక్ గాలులు, తుఫానుల తాకిడికి ఈ ద్వీపం ఇసుక దిబ్బలు నిరంతరం కదులుతూ.. దాని పరిమాణాన్ని, స్వరూపాన్ని మారుస్తూ ఉంటాయి.

ఈ ద్వీపం చుట్టుపక్కల జలాలంటే నావికులు ఎప్పటినుంచో భయపడుతుంటారు. ఇక్కడి కదిలే ఇసుక దిబ్బలు, దట్టమైన పొగమంచు, అనూహ్యమైన కఠిన వాతావరణం కారణంగా చరిత్రలో 350కి పైగా ఓడ ప్రమాదాలు జరిగాయి. అందుకే సేబుల్ ద్వీపానికి అట్లాంటిక్ స్మశానం అనే మారుపేరు వచ్చింది. ప్రస్తుతం ఈ సున్నితమైన పర్యావరణాన్ని కాపాడటానికి కెనడా ప్రభుత్వం దీనిని సేబుల్ ఐలాండ్ నేషనల్ పార్క్ రిజర్వ్ గా ప్రకటించి.. ప్రజల ప్రవేశాన్ని కఠినంగా నియంత్రిస్తోంది.

ఈ ద్వీపానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చినవి ఇక్కడి అడవి గుర్రాలే. 18వ వలసవాద కాలంలో నోవా స్కోటియా నుండి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసిన గుర్రాల నుంచే ఈ జంతువులు వృద్ధి చెందాయని చరిత్రకారులు నమ్ముతారు. వేటాడే జంతువులు లేదా మానవ జోక్యం లేకపోవడంతో ఇవి పూర్తిగా అడవి జనాభాగా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం దాదాపు 500 గుర్రాలు ఈ ద్వీపమంతటా స్వేచ్ఛగా సంచరిస్తూ.. సముద్రపు ఒడ్డున ఉన్న సహజ గడ్డిని తింటూ, ఇసుక దిబ్బల మధ్య ఏర్పడిన మంచినీటి చెరువులపై ఆధారపడుతున్నాయి. వీటికి ఎలాంటి అదనపు దాణా గానీ, పశువైద్య చికిత్స గానీ అందదు. కెనడియన్ చట్టం వీటిని కేవలం రక్షిస్తుంది. వీటి మనుగడను సహజ ప్రక్రియలకే వదిలేసింది. శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా వీటి జన్యుశాస్త్రం, సామాజిక ప్రవర్తనపై పరిశోధనలు చేస్తున్నారు.

ఈ దీవిలో గుర్రాలే కాకుండా.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రే సీల్స్ సంతానోత్పత్తి కేంద్రాలలో సేబుల్ ఐలాండ్ ఒకటి. ప్రతి శీతాకాలంలో ఇక్కడి తీరాలలో పదివేల కొద్దీ సీల్ పిల్లలు జన్మిస్తాయి. వీటితో పాటు హార్బర్ సీల్స్, తిమింగలాలు, డాల్ఫిన్లు ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ప్రయాణించే వందలాది వలస పక్షి జాతులకు (అట్లాంటిక్ ఫ్లైవే మార్గం) ఇది ఒక కీలకమైన విరామ స్థలంగా పనిచేస్తోంది. భూమిపై వీటిని వేటాడే జంతువులు లేకపోవడం వల్ల అనేక పక్షులు ఇక్కడ సురక్షితంగా గూళ్ళు కట్టుకుంటాయి.

మానవ ప్రమేయం లేని పర్యావరణ వ్యవస్థను పరిశీలించడానికి పరిశోధకులకు ఇదొక అరుదైన అవకాశంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, బలమైన అట్లాంటిక్ తుఫానుల వల్ల పల్లపు తీరప్రాంతాల రూపురేఖలు ఎలా మారుతాయో అధ్యయనం చేయడానికి ఈ ఇసుక ద్వీపం ఒక సహజ ప్రయోగశాలగా ఉపయోగపడుతోంది. తీరప్రాంత కోత, ఇసుక దిబ్బల కదలిక, పర్యావరణ ఒత్తిడికి జంతువులు ఎలా అనుగుణంగా మారుతాయనే విషయాలపై శాస్త్రవేత్తలు ఇక్కడ నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ప్రకృతి తనంతట తానుగా భూభాగాన్ని తీర్చిదిద్దుకునే అతికొద్ది ప్రదేశాలలో ఒకటైన సేబుల్ ఐలాండ్.. నేటికీ అద్భుతమైన వన్యప్రాణుల ప్రపంచంగా విరాజిల్లుతోంది.