Skip to content
వినోదం వార్తలు

ఎకరం పొలం ఉంటే.. 4 బర్రెలు పెట్టుకుని హాయిగా బతికేయవచ్చు.. మై విలేజ్ షో ఫేమ్ అంజిమామ ఆవేదన వినండి..

Prajapaksham 20 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
ఎకరం పొలం ఉంటే.. 4 బర్రెలు పెట్టుకుని హాయిగా బతికేయవచ్చు.. మై విలేజ్ షో ఫేమ్ అంజిమామ ఆవేదన వినండి..

My Village Show Fame Anji Mama

My Village Show Fame Anji Mama: మై విలేజ్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అంజిమామ.. ప్రస్తుతం సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, ఆర్థిక ఇబ్బందులు, చేసిన తప్పులు, ఎదుర్కొన్న నష్టాల గురించి ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

త్వరగా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు కావాలనే ఆలోచనతో చాలామంది రిస్క్‌ ఉన్న పెట్టుబడుల వైపు వెళ్తుంటారు. తాను కూడా అలాంటి తప్పే చేశానని అంజిమామ తెలిపారు. ఫ్రెండ్స్, పరిచయస్తుల మాటలు నమ్మి బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీతో పాటు వివిధ ఫైనాన్షియల్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెట్టి దాదాపు రూ.23-24 లక్షలు నష్టపోయినట్లు ఆయన వెల్లడించారు.

భారీగా డబ్బు పోవడంతో అప్పులు తీర్చడం కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అక్కడ రోజుకు 12 గంటలకు పైగా కష్టపడి పనిచేసి అప్పులను తీర్చుకున్నట్లు తన అనుభవాన్ని పంచుకున్నారు.

వ్యాపారంలోనైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వలేదని అంజిమామ చెప్పారు. అంతకుముందు మెడికల్ రిప్రజెంటేటివ్ (MR)గా కూడా పనిచేసినట్లు తెలిపారు. సరైన అవగాహన లేకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టడం, వస్తువులను కొనుగోలు చేసిన ధరకు లేదా తక్కువ ధరకే విక్రయించడం వంటి తప్పుల వల్ల నష్టపోయినట్లు వివరించారు.

సోషల్ మీడియా ప్రమోషన్ల గురించి కూడా అంజిమామ కీలక విషయాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రూ.25 వేల చెల్లిస్తామని చెప్పడంతో ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అయితే ఆ తర్వాత అలాంటి యాప్‌ల వల్ల సామాన్యులు నష్టపోయే అవకాశం ఉందని తెలుసుకుని, తాను చేసిన ప్రమోషన్ వీడియోలను తొలగించినట్లు చెప్పారు.

తన జీవితంలో ఎదురైన అనుభవాల ద్వారా సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ చివరకు నష్టాలకే దారితీయవచ్చని అంజిమామ చెప్పినట్లు తెలుస్తోంది. కష్టపడి సంపాదించిన డబ్బుకు మాత్రమే విలువ ఉంటుందని తన అనుభవంతో వివరించారు.

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతల కోసం హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని అంజిమామ తెలిపారు. ప్రతి నెలా తప్పకుండా ఇంటికి రూ.50 వేల వరకు పంపించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.

క్యాబ్ నడిపే సమయంలో గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్ పెట్టుకున్నప్పటికీ.. కొంతమంది తనను గుర్తుపడుతున్నారని తెలిపారు. అయినప్పటికీ కుటుంబాన్ని చూసుకోవాలంటే ఈ పని చేయక తప్పడం లేదని అంజిమామ భావోద్వేగానికి లోనయ్యారు.

“ఈ కష్టాలన్నీ ఎందుకు పడాలి? నా ఊరికి వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఒక ఎకరం పొలం, నాలుగు బర్రెలు ఉంటే చాలు.. హాయిగా బ్రతికేయొచ్చు అనిపిస్తుంది” అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు.

ఇక అంజిమామ కెరీర్ విషయానికి వస్తే.. మేమ్ ఫేమస్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ సుకుమారి సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించారు. మై విలేజ్ షోతో పాపులర్ అయిన అంజిమామ.. ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆయనకు ఎలాంటి పాత్రలు, అవకాశాలు వస్తాయో చూడాలి.