వైసీపీ దమ్మేంటో కూటమికి చూపించాలి.. స్ఠానిక ఎన్నికలపై నేతలకు, పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం..
YS Jagan Slams Government
ఆంధ్రప్రదేశ్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు పలువురు నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్.. రాష్ట్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీసుల ద్వారా ఒత్తిళ్లు లేదా బెదిరింపులు ఎదురయ్యే అవకాశం ఉందని జగన్ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. అయితే ఎలాంటి బెదిరింపులకు కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా పనిచేయాలని సూచించారు.
స్థానిక స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల స్థాయిలో నాయకులు కార్యకర్తలతో నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ఇప్పటి నుంచే ప్రజల్లో విస్తృతంగా పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఇదే సమయంలో ప్రజలతో మరింతగా మమేకం కావడానికి తన రాజకీయ కార్యక్రమాలను కూడా విస్తరించనున్నట్లు జగన్ వెల్లడించారు. మరో ఏడాదిలో ప్రజా పర్యటనలు, పాదయాత్రను ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమీక్షతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత బలోపేతంపై వైఎస్సార్సీపీ దృష్టి సారిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికలను రాజకీయంగా కీలకమైన పరీక్షగా భావిస్తున్న పార్టీ.. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి నాయకత్వాన్ని సిద్ధం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
- ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. పదో తరగతి విద్యార్థులే డబ్బుల కోసం దారుణంగా..
- IMD బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆగస్టు 25 వరకు పలు రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరికలు..
- SBI ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి నగదు విత్డ్రాపై కొత్త ఛార్జీలు..
- వైసీపీ దమ్మేంటో కూటమికి చూపించాలి.. స్ఠానిక ఎన్నికలపై నేతలకు, పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం..
- Ayushman Bharat: మీకు రూ. 5 లక్షల ఉచిత వైద్యం అందుతుందా.. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చూడండి