Iran-US War: ఇప్పుడే యుద్ధం ముగించడం మంచిది.. ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యల వెనుక అసలు కారణమేంటి..
Iran vs America
Iran-US War: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పజెష్కియన్ అమెరికాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇది సరైన సమయమని, ఇరాన్ ప్రస్తుతం “శక్తి, గౌరవం” ఉన్న స్థితిలో ఉందని అన్నారు. ఇదే సమయంలో అమెరికా ఇరాన్పై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలకు సిద్ధమవుతోంది.
Iran-US War: అమెరికా- ఇరాన్ దేశాల మధ్య గత ఆరు నెలలుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య దౌత్య చర్చలు పూర్తిగా నిలిచిపోయినప్పటికీ.. ప్రస్తుతం ఇరాన్ వ్యూహాత్మకంగా బలమైన స్థితిలో ఉందని పేర్కొంటూ అమెరికాతో సాగుతున్న యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ బహిరంగంగా పిలుపునిచ్చారు.
శుక్రవారం నాడు వైద్యులతో జరిగిన కీలక సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇరాన్ ప్రస్తుతం ఎంతో శక్తివంతమైన, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నందున ఈ యుద్ధాన్ని నిలిపివేయడమే అత్యంత శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ నిబంధనలన్నింటినీ మట్టిలో కలిపి ఇరాన్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, కీలక మౌలిక సదుపాయాలపై విచక్షణారహితంగా దాడులకు తెగబడిందని, ఈ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం తీవ్ర ద్వేషాన్ని మూటగట్టుకుందని ఆయన నొక్కిచెప్పారు. ఇరాన్ సాధించిన ధీటైన విజయాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయని పెజెష్కియన్ స్పష్టం చేశారు.

అయితే ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి అధికారాలు అంతిమంగా సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీకి లోబడి ఉంటాయి. దేశీయంగా పార్లమెంటులోని కఠినవాద రాజకీయ శత్రువులు తమ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోతోందని, అనవసర రాయితీలు ఇస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో, పెజెష్కియన్ వాషింగ్టన్తో కుదుర్చుకున్న జూన్ నాటి అవగాహన ఒప్పందాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. సదరు ఒప్పందంలో లొంగిపోవడాన్ని సూచించే ఒక్క చిన్న నిబంధన కూడా లేదని.. ఒప్పందంలోని అన్ని కట్టుబాట్లు కేవలం అవతలి పక్షానికి అంటే అమెరికాకు మాత్రమే వర్తిస్తాయని ఆయన ఉద్ఘాటించారు.
కానీ ఈ అవగాహన ఒప్పందం గడువు ముగిసిన కొన్ని రోజులకే ఇరాన్ సైనిక బలగాలు తమ వైఖరిని మరింత కఠినతరం చేశాయి. శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి కొత్త రకం ముప్పులకైనా అత్యంత తీవ్రమైన, శిక్షార్హమైన, వినాశకరమైన ప్రతిదాడి చేయడానికి తమ దేశ సైన్యం సిద్ధంగా ఉందని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్-జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. భూమి, సముద్రం, ఆకాశం, వాయు రక్షణ, సైబర్స్పేస్ వంటి అన్ని రంగాల్లో ఇరాన్ బలగాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని ఆయన విస్పష్టంగా స్పష్టం చేశారు.
మరొకవైపు ఇరాన్, అమెరికాల మధ్య నిలిచిపోయిన దౌత్య చర్చలను తిరిగి ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులను కల్పించడంపై, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన పరిస్థితులపై ఒమన్, ఇరాన్ విదేశాంగ మంత్రులు ఫోన్ సంభాషణ ద్వారా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రస్తుతం వాషింగ్టన్ ప్రభుత్వం నౌకాదళ ప్రతిదిగ్బంధనాన్ని కొనసాగిస్తుండగా.. ఇరాన్ పాలకులు ఈ కీలకమైన జలమార్గాన్ని పాక్షికంగా మూసివేశారు. అయితే అమెరికా నౌకాదళం ఈ జలసంధి యొక్క దక్షిణ భాగం గుండా అత్యంత రహస్యంగా చమురు ట్యాంకర్ల కాన్వాయ్లను ఏర్పాటు చేసి.. వాటికి రక్షణ కల్పిస్తూ రోజుకు ఐదు నుండి పది మిలియన్ల బ్యారెళ్ల చమురు ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటోందని కథనాలు వెలువడుతున్నాయి.
అటు వాషింగ్టన్లో ప్రతిస్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ వైఖరిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు టెహ్రాన్ సిద్ధంగా ఉందనే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల ఎంపికలు పరిమితంగా ఉన్నాయా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. అక్కడ ఏం జరుగుతుందో తాము నిశితంగా గమనిస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు.
హార్ముజ్ జలసంధి ప్రాంతంతో పాటు దానికి సంబంధించిన భూభాగంపై కూడా తమకు పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. ఇరాన్ నాయకులు ఒప్పందం చేసుకోవాలని ఆశిస్తున్నప్పటికీ.. సరైన నిబంధనలతో ఒప్పందానికి రావడం వారికి ఇష్టం లేదని విమర్శించారు. ఇదే సమయంలో ఇరాన్కు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ఆసరా కల్పించినా ఆయా దేశాలు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ ఉద్రిక్తతల మధ్య, దౌత్య లేదా సైనిక ఒత్తిడి కంటే ఆర్థిక ఆంక్షల ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చేస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆరు నెలల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో, అమెరికా ప్రభుత్వం నేరుగా సైనిక పోరాటానికి స్వస్తి చెప్పి, ఆర్థిక దిగ్బంధనం వైపు అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ప్రతిపాదిత నూతన ఆంక్షల ప్రణాళికను వివరించడానికి స్కాట్ బెసెంట్ త్వరలోనే ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఒక ప్రత్యేక పత్రికా సమావేశం నిర్వహించనున్నారు.
అమెరికా యొక్క ఈ నూతన ఆంక్షల వ్యూహాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా వైఖరిని “ఆర్థిక ఉగ్రవాదం” గా అభివర్ణించిన టెహ్రాన్, ఇటువంటి అక్రమ ఆంక్షలకు ప్రేరేపించే వ్యక్తులు, నాయకులు కచ్చితంగా విచారణను, కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంతర్జాతీయ వివాదంపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ కూడా స్పందించారు. ఏకపక్ష ఆంక్షలు మరియు ఒత్తిళ్లు ఏ సమస్యకూ పరిష్కారం కాజాలవని ఆయన హితవు పలికారు. ప్రపంచ శాంతిని దృష్టిలో ఉంచుకుని అన్ని పక్షాలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కేవలం రాజకీయ మరియు దౌత్య మార్గాల ద్వారానే ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని చైనా కోరింది.
- Kadapa MP YS Avinash Reddy: కడప ఎంపీ అవినాష్రెడ్డి నివాసంలో 6 గంటల పాటు కొనసాగిన ఈడీ తనిఖీలు..కీలక డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం…
- Iran-US War: ఇప్పుడే యుద్ధం ముగించడం మంచిది.. ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యల వెనుక అసలు కారణమేంటి..
- బ్యాడ్ టైం బ్యాండ్ బాజా పాడుకుంటున్న అల్లరి నరేష్
- త్రివిక్రమ్ తో పోల్చడం గౌరవంగా భావిస్తున్నాను.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ దర్శకుడు వెంకీ అట్లూరి
- శ్రమతో ఆర్జించే వారిదే ‘అర్జక్ సంఘ్’ : రామ్ స్వరూప్ వర్మ