‘ఈవీ’ విప్లవం.. ప్రకృతిపై ఎంత భారం?
EV
నూకల దేవేందర్
ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. భారతదేశం సైతం నగరాలను కాలుష్య రహితం చేయడానికి ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీనికి సంబంధించి కార్యాచరణ కొనసాగుతున్నది. హైదరాబాద్ను కాలుష్యం నుంచి విముక్తి చేయడానికి ‘క్యూర్’ పరిధిలో ఈవీ ఆటోలకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో కాలుష్య నివారణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఈవీల వల్ల పట్టణాలు, నగరాల్లో కాలుష్యాన్ని కొంతమేర నివారించగలిగినా.. వాటి తయారీకి అవసరమయ్యే ఖనిజాల కోసం గ్రామాలు, అడవులు, పర్వతాలు, తద్వారా ప్రకృతికి ఎంత మేర నష్టం జరుగుతుందో ప్రభుత్వాలు ఒక అంచనా వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఆరు రెట్లు ఎక్కువ ఖనిజాలు ః సాధారణ పెట్రోల్ కారు కంటే ఈవీ కారును తయారు చేయడానికి ఆరు రేట్లు ఎక్కువ ఖనిజాలు అవసరమవుతాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీలు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థల కోసం రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి ఖనిజాలు ఎక్కువగా అవసరం కావడమేకారణమని తేల్చింది. మైనింగ్తో సమస్యే. ఈవీల తయారీకి అవసరమయ్యే ఖనిజాలు వెలికితీయాలంటే పెద్ద గనులు ఏర్పాటు చేసి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అడవులను నరకడం, కొండలను తొలగించడం వంటి చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. భూములను తవ్వడం, ఖనిజాలను వేరు చేయడం, శుధ్ధి చేయడానికి నీరు, విద్యు త్ అవసరమవుతాయి. దీనివల్ల కూడా పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడి వేరే మార్గాల ద్వారా కాలుష్యం పెరగవచ్చు.
ఈవీతో తగ్గే కాలుష్యమెంత?ః ఎలక్ట్రిక్ వాహనాలు వంద శాతం కాలుష్యరహిత వాహనాలు కావు. పెట్రోల్ కార్లతో పోలిస్తే మన దేశంలో వీటి జీవిత కాల ఉద్గారాలు సుమారు 20 శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయని అనేక నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు ఈవీ తయారీకి అవసరమయ్యే ఖనిజాలు తవ్వే సమయంలో, వాటిని శుద్ధి చేసే సమయంలో, బ్యాటరీ తయారు చేసే సమయం లో పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
‘రీసైక్లింగ్’ చేస్తే..ః 2025 నాటికి ప్రపంచ ఈవీ బ్యాటరీ వినియోగం 1.2 టెరావాట్ గంటలకు చేరింది. 2020తో పోలిస్తే ఏది ఏడు రేట్లు ఎక్కువ. భవిష్యత్తులో ఈ డిమాండ్ను తట్టుకోవాలంటే వాడేసిన బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం అత్యంత కీలకం.
ప్రజా రవాణే ప్రస్తుత పరిష్కారంః ప్రతి పెట్రోల్ కారు స్థానంలో ఈవీని రోడ్డెక్కిస్తే పర్యావరణ, కాలుష్య సమస్య తీరదు. దీనివల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు పరిష్కారం దొరకదు. ముందుగా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది. మెట్రో, రైళ్లు, బస్సుల వైపు ప్రజలను మళ్లించాల్సి ఉంటుంది. నడిచే దూరం ఉన్న చోట నడక, సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముంది. అప్పుడే వాహనాల అవసరం తక్కువవుతుంది. పెట్రోల్ కారా, ఈవీ కారా అన్నది కాదు.. అసలు మనకు ఎన్ని కార్లు అవసరం అన్న ప్రశ్నే భవిష్యత్ పర్యావరణ ప్రభావాన్ని నిర్ణయిస్తుంది.
- Independence Day 2026: ఆగస్టు 15, 1947న గాంధీజీ ఎక్కడ ఉన్నారు.. తొలి స్వాతంత్ర్య వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారు..
- అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. లండన్ నుంచే హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి
- ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో జగమే సంగీతం
- ‘మనసా వాచా’ ఆనంద్ దేవరకొండ
- అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా ‘మహాకాళి’