Skip to content
జాతీయం వార్తలు

తెహెల్కా పత్రిక మాజీ సంపాదకుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష… బాంబే హైకోర్టు తీర్పు

Prajapaksham 07 Aug 2026 0 నిమిషాల పఠనం జాతీయం
తెహెల్కా పత్రిక మాజీ సంపాదకుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష… బాంబే హైకోర్టు తీర్పు

తెహెల్కా పత్రిక మాజీ సంపాదకుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష... బాంబే హైకోర్టు తీర్పు

నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశం

సహోద్యోగిపై అత్యాచారం చేసిన (2013) కేసులో మాజీ తెహెల్కా సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు దోషిగా నిర్ధారిస్తూ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆయన్ను ఐదేళ్ల క్రితం నిర్దోషిగా విడుదల చేస్తూ గోవా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును గురువారం బాంబే హైకోర్టు పక్కన పెట్టింది.

బాంబే హైకోర్టు గోవా ధర్మాసనానికి చెందిన జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్సందేకర్ తరుణ్ తేజ్‌పాల్ నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. తొలుత రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించినప్పటికీ, తరుణ్ తేజ్‌పాల్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు ధర్మాసనం ఆ గడువును నాలుగు వారాలకు పొడిగించింది.

ఈ సంఘటన 13 ఏళ్ల క్రితం జరిగిందని, అప్పటి నుంచి తేజ్‌పాల్ ఏ ఇతర నేరానికీ పాల్పడలేదని పేర్కొన్న కోర్టు, అతనికి కనీస శిక్షను విధిస్తున్నట్లు తెలిపింది. “ఇరుపక్షాలు (బాధితురాలు, తేజ్‌పాల్) ఇప్పుడు జీవితంలో ముందుకు సాగిపోయి ఉండవచ్చు” అని ధర్మాసనం పేర్కొంది.

తేజ్‌పాల్‌పై కోర్టు రూ.10,21,000 జరిమానా కూడా విధించింది. దీనిని బాధితురాలికి చెల్లించాల్సి ఉంటుంది. లైంగిక దాడికి గురైన బాధితురాలికి ఈ జరిమానా మొత్తాన్ని అందజేయాలని కోర్టు తెలిపింది.

తేజ్‌పాల్ తాను “ఒక రాజకీయ బాధితుడిని”, “ఇద్దరు కుమార్తెల తండ్రిని” అని పేర్కొంటూ కనికరం చూపాలని ధర్మాసనాన్ని వేడుకున్నారు. అయితే, గోవా ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా “కాదంటే కాదు” అనే గట్టి సందేశం పంపడానికి తేజ్‌పాల్‌కు గరిష్ఠ శిక్ష విధించాలని బెంచ్‌ను కోరారు.

“ట్రయల్ కోర్టు నిర్దోషిత్వ ఉత్తర్వును మేం రద్దు చేస్తున్నాం. ప్రతివాది (తరుణ్ తేజ్‌పాల్) దోషిగా నిర్ధారించబడ్డాడు” అని ధర్మాసనం పేర్కొంది. దీనిపై తేజ్‌పాల్ స్పందిస్తూ హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376(2)(ఎఫ్) (సంరక్షకుడిగా లేదా నమ్మకమైన అధికార స్థానంలో ఉన్న వ్యక్తి ఒక మహిళపై అత్యాచారం చేయడం), 354(ఏ) (లైంగిక వేధింపులు), 354(బి) (ఆమె దుస్తులు తొలగించే ఉద్దేశంతో ఒక మహిళపై నేరపూరిత బలాన్ని ప్రయోగించడం) కింద న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించింది.

సెక్షన్ 376(2)(ఎఫ్) కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 354(ఏ) కింద ఒక సంవత్సరం, సెక్షన్ 354(బి) కింద మూడేళ్ల శిక్షను తరుణ్ తేజ్‌పాల్‌కు ధర్మాసనం విధించింది. అన్ని శిక్షలూ ఏకకాలంలో అమలవుతాయని వెల్లడించింది.

ఈ సందర్భంగా తేజ్‌పాల్ తరపు న్యాయవాది అబాద్ పొండా కనిష్ఠ శిక్షను కోరుతూనే, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్షను, దోషిగా నిర్ధారణను కనీసం 10 వారాల పాటు నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు.

హైకోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తరుణ్ తేజ్‌పాల్ విలేకరులకు తెలియజేశారు.

2013 నవంబరులో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్ కార్యక్రమానికి వెళ్లినప్పుడు, ఒక హోటల్ ఎలివేటర్‌లో ఆ సీనియర్ జర్నలిస్ట్ తన మాజీ జూనియర్ సహోద్యోగిపై లైంగిక దాడి చేశారనే ఆమె ఆరోపణలకు సంబంధించినదే ఈ కేసు. 2021లో ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించిన తర్వాత, గోవా ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది.

తేజ్‌పాల్ తరపు న్యాయవాది పొండా మాట్లాడుతూ తరుణ్ తేజ్‌పాల్ విచారణ జరిగినప్పటి నుంచి బెయిల్‌పైనే ఉన్నాడని, తనపై విధించిన షరతుల్లో దేనినీ ఎప్పుడూ ఉల్లంఘించలేదని, అతను ఇప్పుడు వయోవృద్ధుడని చెప్పారు.

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ తేజ్‌పాల్ ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరిని, అలాగే ఆరోపిత సంఘటన అనంతరం బాధితురాలు మామూలుగానే ప్రవర్తిస్తున్నట్లు చిత్రీకరించడాన్ని పరిగణనలోకి తీసుకుని అతనికి గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని పేర్కొన్నారు. తేజ్‌పాల్ బాధితురాలిపై ఆధిపత్య ధోరణిలో ఉండేవాడని, బాధితురాలు కేవలం సహోద్యోగి మాత్రమే కాదని, అతని కుమార్తెకు స్నేహితురాలు కూడా అనే విషయంలో ఏ మాత్రం పశ్చాత్తాపం సైతం చూపలేదని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు: BJP Indian Politics