Skip to content
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌లో సుస్మిత వ్యాఖ్యల చిచ్చు.. హద్దులు దాటితే చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక..

Prajapaksham 20 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
కాంగ్రెస్‌లో సుస్మిత వ్యాఖ్యల చిచ్చు.. హద్దులు దాటితే చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక..

Mahesh Kumar Goud Says Congress Will Win 100 Seats in Next Elections

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విమర్శలు, వివాదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పార్టీ క్రమశిక్షణే ప్రధానమని, ఎంతటి వారైనా హద్దులు దాటి మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత, అలాగే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశామని, వారు ఇచ్చే వివరణ ఆధారంగా క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు తగిన చర్యలు ఉంటాయని తెలిపారు. సీట్ల కేటాయింపుకు పార్టీలో స్పష్టమైన నియమావళి ఉంటుందని, ఎవరికి వారు అభ్యర్థులుగా ప్రకటించుకోవడం సరికాదని చురకలంటించారు. ఇక 22ఏ భూముల వ్యవహారంలో జరిగిన చిన్న పొరపాటును సరిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారని, ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని మండిపడ్డారు.

మరోవైపు కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుస్మిత వ్యవహారశైలి వల్ల మంత్రి కొండా సురేఖ సమాజంలో తలదించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని, అలాంటి సీఎంపై విమర్శలు చేయడానికి సుస్మితకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. చాలామంది నాయకులకు సన్ స్ట్రోక్ ఉంటే.. కొండా సురేఖకు మాత్రం ‘డాటర్ స్ట్రోక్’ తగిలింది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్, బీజేపీ హస్తం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిపై కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలను కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా తీసుకుంది. సుస్మితకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం లేకపోవడంతో, ఆమె తల్లి అయిన మంత్రి కొండా సురేఖకు కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతంలోనూ సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ సీఎంకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ లేఖలో ఆమె తన కుమార్తె వ్యాఖ్యలను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా లేదా పరకాల నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను లేవనెత్తుతారా అనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.