తెలంగాణలో ఎవరికీ తెలియని చరిత్ర.. రామప్ప చెరువు నీటి రహస్యం ఇదే.. ములుగు అడవుల్లో దాగిన 800 ఏళ్ల జల మిస్టరీ
Ramappa cheruvu
తెలంగాణలోని ములుగు అడవుల మధ్య ఉన్న రామప్ప చెరువు కేవలం ఒక పురాతన నీటి వనరు కాదు.. కాకతీయుల అసాధారణ జల నిర్వహణకు నిలువెత్తు ఉదాహరణ. 13వ శతాబ్దంలో గణపతిదేవుడి కాలంలో నిర్మించిన ఈ చెరువు, రామప్ప ఆలయ పరిసరాల్లోని కొండలు, వాగులు, వ్యవసాయ భూములతో అనుసంధానమై ఉండేలా రూపొందించబడింది.
Telangana’s Hidden Heritage: తెలంగాణ అంటే చారిత్రక కోటలు, దేవాలయాలు, చెరువులు, ఉద్యమాల చరిత్ర మాత్రమే కాదు.. శతాబ్దాల క్రితమే నీటి నిర్వహణలో అద్భుతమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించిన ప్రాంతం కూడా అని చెప్పవచ్చు. ముఖ్యంగా కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు, కాలువల వ్యవస్థ ఇప్పటికీ ఇంజినీర్లను ఆశ్చర్యపరుస్తోంది. వాటిలో చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం రామప్ప చెరువు నీటి నిర్వహణ వ్యవస్థ.
ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం గురించి చాలామందికి తెలుసు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కానీ ఈ ఆలయానికి సమీపంలో ఉన్న రామప్ప చెరువు వెనుక ఉన్న నీటి నిర్వహణ ఆలోచన గురించి మాత్రం పెద్దగా చర్చ జరగదు.
ఆలయం మాత్రమే కాదు.. భారీ నీటి వ్యవస్థ కూడా..
కాకతీయుల కాలంలో తెలంగాణ భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో చెరువులు నిర్మించారు. వర్షపు నీటిని వృథాగా వెళ్లనివ్వకుండా ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు చేరేలా వ్యవస్థను రూపొందించారు. దీనినే ప్రస్తుతం చాలామంది చెయిన్ ఆఫ్ ట్యాంక్స్ లేదా చెరువుల పరంపరగా పిలుస్తారు. ఒక ప్రాంతంలో కురిసిన వర్షపు నీటిని ఒక్కసారిగా నదుల్లోకి పంపకుండా.. దశలవారీగా నిల్వ చేయడం ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశం. పై ప్రాంతంలోని చెరువు నిండిన తర్వాత మిగిలిన నీరు దిగువ ప్రాంతంలోని మరో చెరువుకు చేరేది. ఇలా వరుసగా అనేక చెరువులు నీటిని నిల్వ చేసేవి. దీంతో ఒకే వర్షం ద్వారా పెద్ద ప్రాంతానికి సాగునీరు అందే అవకాశం ఉండేది.
రామప్ప చెరువు నిర్మాణంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ప్రకృతి భౌగోళిక స్వరూపాన్ని ఇంజినీరింగ్లో భాగం చేసుకోవడం. కొండల మధ్య సహజంగా వచ్చే వర్షపు నీటి ప్రవాహాలను గుర్తించి, వాటిని ఒకే జలాశయంలోకి మళ్లించే విధంగా చెరువు నిర్మాణాన్ని రూపొందించారు. చెరువు కట్ట.. కొండలను అనుసంధానించే విధంగా నిర్మించబడింది.అంటే నేటి కాలంలో మనం చెప్పుకునే catchment area, runoff management, storage వంటి భావనలకు సమానమైన ఆలోచన అప్పట్లోనే అమలులో ఉందన్నమాట.
అప్పట్లోనే క్యాచ్మెంట్పై అవగాహన:
కాకతీయుల నీటి నిర్మాణాల్లో మరో ఆసక్తికరమైన అంశం వర్షపు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ నిల్వ చేయాలి? అనే విషయంపై ఉన్న అవగాహన. చెరువులను నిర్మించేటప్పుడు భూమి వాలు, సహజ నీటి ప్రవాహ మార్గాలు, మట్టి స్వభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చారిత్రక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే.. వర్షం పడిన తర్వాత నీరు సహజంగా ఏ దిశలో ప్రవహిస్తుందో గమనించి.. ఆ ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా చెరువులను ఏర్పాటు చేసేవారు. ఇది ఆధునిక కాలంలో మనం చెప్పుకునే వాటర్ క్యాచ్మెంట్ మేనేజ్మెంట్ భావనకు దగ్గరగా ఉంటుంది.
చెరువు అంటే కేవలం నీటి నిల్వ కాదు! కాకతీయుల కాలంలో చెరువు ఒక గ్రామానికి జీవనాధారంగా ఉండేది. సాగునీటితో పాటు తాగునీరు, పశువులకు నీరు, భూగర్భజలాల పెరుగుదల వంటి అనేక ప్రయోజనాలు ఉండేవి. చెరువులో నీరు నిల్వ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగేవి. దీంతో బావులు, ఇతర నీటి వనరులు ఎక్కువకాలం నీటిని అందించేవి. అందుకే ఒక చెరువు నిర్మాణం అంటే కేవలం ఒక గట్టు నిర్మించడం కాదని.. దాని చుట్టూ ఉన్న మొత్తం గ్రామీణ జీవన వ్యవస్థను పరిగణనలోకి తీసుకునే ప్రయత్నమని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కట్ట నిర్మాణం. రామప్ప చెరువు.. కట్ట లోపలికి, బయటికి వాలుగా ఉండేలా రూపొందించబడిందని ఒక ఆర్కిటెక్చర్ అధ్యయనం వివరిస్తోంది. అధిక నీరు వచ్చినప్పుడు ఓవర్ఫ్లో వల్ల కట్టకు తీవ్రమైన నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్ట చుట్టూ చెట్లను పెంచడం ద్వారా మట్టి కోతను తగ్గించే ప్రయత్నం కూడా చేసినట్లు అధ్యయనం చెబుతోంది.
రామప్పను ఒంటరి జలాశయంగా చూడటం కంటే కాకతీయుల విస్తృత చెరువుల సంస్కృతిలో ఒక భాగంగా చూడటం ఆసక్తికరం. తెలంగాణలోని చెరువులు స్థానిక వర్షపాతం, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నీటిని నిల్వ చేసి, వ్యవసాయానికి ఉపయోగించేవి. గ్రామస్థాయిలో చెరువు కట్టల సంరక్షణ, పూడిక తొలగింపు, నీటి వినియోగ నియంత్రణకు కూడా వ్యవస్థలు ఉండేవని తెలంగాణ SCERT పాఠ్యాంశాలు వివరిస్తున్నాయి.
అందుకే రామప్ప చెరువు కథ 800 ఏళ్ల క్రితం నీటిని ఎలా చూడాలో నేర్పిన ఇంజినీరింగ్ పాఠంగా చెప్పవచ్చు. UNESCO కూడా రామప్ప ఆలయ సముదాయం చుట్టూ ఉన్న కృత్రిమ జలాశయం, సాగుభూములు, కొండలు, అడవులు, నీటి క్యాచ్మెంట్ ప్రాంతాలు పరస్పరం అనుసంధానమైన సాంస్కృతిక-ప్రకృతి వ్యవస్థగా ఉన్నాయని గుర్తించింది
ఇప్పటికీ కనిపిస్తున్న ఆనవాళ్లు:
కాలం మారిపోయింది. పట్టణాలు పెరిగాయి. కొత్త రహదారులు, భవనాలు వచ్చాయి. అనేక పురాతన చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చెరువుల నీటి ప్రవాహ మార్గాలు కూడా కనుమరుగయ్యాయి. అయినప్పటికీ తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కాకతీయుల కాలం నాటి చెరువుల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు నగరాలు, పట్టణాల్లో వరద సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ పురాతన నీటి నిర్వహణ విధానం మరోసారి చర్చకు వస్తోంది.
మన పూర్వీకుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం
ప్రస్తుతం వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను పెంచడం, పట్టణ వరదలను తగ్గించడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ వందల ఏళ్ల క్రితమే తెలంగాణలోని ప్రజలు ప్రకృతి నీటి ప్రవాహాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చెరువుల వ్యవస్థను అభివృద్ధి చేశారు. రామప్ప చెరువు కథలో అసలు ఆసక్తికరమైన విషయం ఇదే.. మనకు కనిపించేది ఒక చెరువు. కానీ దాని వెనుక కనిపించని ఒక పూర్తి నీటి నిర్వహణ వ్యవస్థ ఉంది.
అందుకే తెలంగాణ చరిత్రను కేవలం కోటలు, దేవాలయాలు, రాజుల కథలతో మాత్రమే చూడకూడదు. చెరువుల గట్లపై, కాలువల వెంట, పాత నీటి మార్గాల్లో కూడా తెలంగాణ నాగరికతకు సంబంధించిన ఎన్నో తెలియని కథలు దాగి ఉన్నాయి.
- తెలంగాణ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్.. లండన్, అమెరికాలో కీలక భేటీలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
- కేసీఆర్ది దొరల న్యాయం.. మాది సామాజిక న్యాయం.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి..
- Thousand Pillar Temple: వేయి స్తంభాల గుడి వెనుక దాగిన రహస్యాలు.. ఇప్పటికీ ఎవరికీ అర్థంకానిది అదొక్కటే..
- తెలంగాణలో ఎవరికీ తెలియని చరిత్ర.. రామప్ప చెరువు నీటి రహస్యం ఇదే.. ములుగు అడవుల్లో దాగిన 800 ఏళ్ల జల మిస్టరీ
- Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. మరో 5 రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే