నీళ్లు బదులు డేటాని తాగాలా.. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్పై కోర్టులో కేసు.. ఎవరేశారంటే..
Google AI data Center
గూగుల్, అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో నిర్మించనున్న 15 బిలియన్ డాలర్ల AI డేటా సెంటర్ ప్రాజెక్టు పర్యావరణ వివాదంలో చిక్కుకుంది. పర్యావరణవేత్తలు, స్థానిక సంఘాలు ఈ ప్రాజెక్టు నీటి వనరులపై ఒత్తిడి పెంచుతుందని, కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యానికి సమీపంలో ఉండటంతో జీవవైవిధ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ విప్లవానికి బాటలు వేస్తూ విశాఖపట్నంలో గూగుల్ సంస్థ అదానీ గ్రూప్తో కలిసి దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో భారీ డేటా సెంటర్ నిర్మాణానికి పూనుకుంది. దాదాపు 1.88 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం కొండలను చదును చేసే పనులు వేగంగా సాగుతుండగా.. మరోవైపు తీవ్ర పర్యావరణ, నీటి కొరత ఆందోళనలతో ఈ ప్రాజెక్ట్ ప్రజా వ్యతిరేకతను, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
డేటాను తాగలేము.. నీటి కొరతపై వెల్లువెత్తుతున్న నిరసనలు:
ప్రస్తుతం 25 లక్షల జనాభా కలిగిన విశాఖ నగరానికి రోజువారీ నీటి అవసరం 48 కోట్ల లీటర్లు ఉండగా.. సరఫరా కేవలం 41 కోట్ల లీటర్లు మాత్రమే అందుతోంది. ఇప్పటికే నగరంలో నీటి రేషనింగ్ అమలులో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సర్వర్ల కూలింగ్ కోసం రోజూ మిలియన్ల లీటర్ల నీరు అవసరమయ్యే ఈ డేటా సెంటర్కు ప్రభుత్వం 20 ఏళ్ల పాటు ‘హామీతో కూడిన’ నీటి సరఫరా ఇస్తామని ప్రకటించడంపై పర్యావరణవేత్తలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మేము డేటాను తాగలేము అంటూ చిన్నారులు, స్థానిక కార్యకర్తలు ప్లకార్డులతో ఇంటింటి ప్రచారాలు, బీచ్ నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రజా జీవనోపాధిని, ప్రాథమిక అవసరాలను దెబ్బతీసేలా అభివృద్ధి ఉండకూడదని ‘గ్రీన్ విశాఖ’ సంస్థ స్పష్టం చేసింది.
హైకోర్టు నోటీసులు & ఎన్జీటీలో కేసులు: కేవలం 860 మీటర్ల దూరంలో ఉన్న కంబలకొండ వన్యప్రాణుల అభయారణ్యంపై ఈ భారీ నిర్మాణాలు, శబ్ద కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
హైకోర్టు పిటిషన్: జల్ బిరాదరి సంస్థ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) పై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 24న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఎన్జీటీ కేసులు: గ్రామీణ నీటి పథకాల ప్రభావాలను అంచనా వేయకుండా ఆమోదం తెలిపారంటూ మానవ హక్కుల వేదిక (HRF) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో మరో మూడు కేసులు దాఖలు చేసింది.
ప్రభుత్వం & గూగుల్ స్పందన: ఈ విమర్శలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పర్యావరణవేత్తల ఆందోళనలు అసంబద్ధమైనవని, స్థానిక జలాశయాలు లేదా గ్రామీణ నీటిని ఈ ప్రైవేట్ ప్రాజెక్ట్కు వాడబోమని స్పష్టం చేసింది. అభయారణ్యం చట్టబద్ధమైన పరిమితి దూరంలోనే ఉందని, అయితే ప్రజాస్వామ్యయుత ప్రజాభిప్రాయాలను స్వీకరించి న్యాయమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.
మరోవైపు గూగుల్ సంస్థ కూడా ఈ వివాదంపై స్పందించింది. తాము స్థానిక చట్టాలకు లోబడి పనిచేస్తామని.. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అధునాతన ఎయిర్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తామని తెలిపింది. స్థానిక పరిసరాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించని శాంతియుత పొరుగువారిగా ఉంటామని కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
- హైదరాబాద్లో పది లక్షల మంది ఓటర్లు గల్లంతు..సీఈసీ స్పందన ఇదే..
- ఎండలను తట్టుకునేందుకు కుక్క మాంసం సూప్ తాగండి.. ప్రజలకు ఉత్తర కొరియా సంచలన సూచన..
- చిరంజీవికి కూటమి ప్రభుత్వం మెగా ఆఫర్ ఇచ్చినట్లేనా.. తమ్ముడి బాటలోకే అన్న కూడా వస్తున్నారా..
- నీళ్లు బదులు డేటాని తాగాలా.. వైజాగ్ గూగుల్ డేటా సెంటర్పై కోర్టులో కేసు.. ఎవరేశారంటే..
- బంగారం ధర 37% పడిపోతుందా..? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక చెబుతున్న సంచలన విషయాలు ఇవే…