Skip to content
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల గుట్టురట్టు.. 25 టన్నుల కల్తీ మిర్చి, పసుపు, ధనియాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

Prajapaksham 04 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
హైదరాబాద్‌లో కల్తీ మసాలాల గుట్టురట్టు.. 25 టన్నుల కల్తీ మిర్చి, పసుపు, ధనియాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

CV Sajjanar Warns Police Personnel Against Misbehavior with Victims

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కల్తీ మసాలా తయారీ కేంద్రాలే లక్ష్యంగా హెచ్-ఫాస్ట్ (H-FAST – Hyderabad Food Adulteration Surveillance Team) దాడులు చేపట్టాయి. ప్రజల నుండి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నగరంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 13 మసాలా వ్యాపార సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

ఈ తనిఖీల్లో సుమారు 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. ఈ అక్రమాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలపై మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి.

సాధారణంగా గృహాల్లో నిత్యం వినియోగించే వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు వంటి మసాలా దినుసుల్లో తీవ్రస్థాయిలో కల్తీ జరుగుతున్నట్లు ఈ సోదాల్లో వెల్లడైంది. వినియోగదారులను ఆకర్షించేందుకు వీటికి మెరుపు, రంగు తీసుకువచ్చే నెపంతో ప్రమాదకరమైన ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ రంగులు, టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రియల్ డైలు , రైస్ బ్రాన్ ఆయిల్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని సీపీ వివరించారు.

దాడుల సమయంలో వీటి తయారీకి ఉపయోగిస్తున్న సుమారు 89 టన్నుల ముడి పదార్థాలను సీజ్ చేసి, నమూనాలను ల్యాబ్‌ పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. కల్తీ రాయుళ్లపై ఆహార భద్రత చట్టం కింద అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఇటువంటి విషపూరిత రసాయనాలతో కూడిన కల్తీ మసాలా దినుసులను క్రమంత తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్, కాలేయం , మూత్రపిండాల (కిడ్నీ) సంబంధిత తీవ్ర వ్యాధులతో పాటు అలర్జీలు, తీవ్రమైన జీర్ణక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యుల హెచ్చరికలను గుర్తుచేశారు. కాగా, హెచ్-ఫాస్ట్ బృందం ఏర్పడిన కొద్ది కాలంలోనే (140 రోజుల్లో) నగరవ్యాప్తంగా 659 ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించి, 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో పాటు మొత్తం 246 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. నగరంలో ఎక్కడైనా కల్తీ ఆహార విక్రయాలు లేదా తయారీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.