కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. భారీ వరద ప్రవాహంతో హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Kaleshwaram
కాలేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు ఆదేశించారు.
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది అత్యంత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సీడబ్ల్యూసీ కాళేశ్వరం స్టేషన్ వద్ద ఉదయం 9:00 గంటలకు నీటిమట్టం 11.50 మీటర్లకు చేరుకుంది. ఇక్కడ హెచ్చరిక స్థాయి 12.210 మీటర్లు, ప్రమాద స్థాయి 13.460 మీటర్లుగా ఉండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 96.40 మీటర్లు నమోదవ్వగా, ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో సమానంగా 8,35,800 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రవాహాన్ని సులువుగా దిగువకు పంపేందుకు బ్యారేజ్ 85 గేట్లను పూర్తిగా ఎత్తివేసి ఫ్రీ ఫ్లో పరిస్థితిని నిర్వహిస్తున్నారు.
తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడనం మరియు డిప్రెషన్ ప్రభావంతో రానున్న 12 నుంచి 18 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో నిరంతరాయంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే వీలుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ పని వేళలు ఇవ్వాలని, ఆఫీసుల్లో ఉన్నవారికి ముందస్తు లాగౌట్ సదుపాయం కల్పించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, మ్యాన్హోల్స్ మరియు తెగిపడిన విద్యుత్ వైర్ల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
- భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్.. ప్రధాని మోదీ రాకకు ముందే బలాన్ని చాటిన జగన్.. కూటమిలో కొత్త గుబులు..
- రైలులో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా? భారత రైల్వే కొత్త రూల్స్ తెలుసుకోండి
- ఏపీలో కూటమికి బీటలు…టీడీపీ, వైసీపీలను ఒకేసారి ఎన్నికల్లో ఓడించిన జనసేన…ఇది దేనికి సంకేతం…
- Peddi Sudarshan Reddy: నర్సంపేటకు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ నేతలు..ఎవరేమన్నారంటే..
- భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం