Peddi Sudarshan Reddy Dies: పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోయామని ఆవేదన..
Peddi Sudarshan Reddy
పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన చెందారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
Peddi Sudarshan Reddy Dies: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొంటూ సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో తనతో కలిసి నడిచిన ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోవడంపై కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించుకోవడానికి పార్టీ పరంగా చేసిన విశ్వప్రయత్నాలు, వైద్యుల బృందం చేసిన శ్రమ ఫలించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. తెలంగాణనే శ్వాసగా, నీతి నిజాయితీలతో ప్రజాజీవనం సాగించిన ఆయన రాజకీయ ప్రస్థానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు.
నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ స్మరించుకున్నారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ, అటు ఉద్యమ పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనదైన చెరగని ముద్ర వేశారని చెప్పారు. పోలీసుల ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా వెరవకుండా ఆయన చూపిన ధైర్యసాహసాలు, స్ఫూర్తి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.
పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన సుదర్శన్ రెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన భార్యాపిల్లలకు, కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కష్ట సమయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
- భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. భారీ వరద ప్రవాహంతో హై అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- Peddi Sudarshan Reddy Dies: పెద్ది సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోయామని ఆవేదన..
- Peddi Sudarshan Reddy No More: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.. తీవ్ర అనారోగ్యంతో పోరాడి కన్నుమూసిన బీఆర్ఎస్ నేత..
- కేంద్ర ప్రభుత్వంలో ప్రచారం అధికం – ఫలితాలు పరిమితం