Hyderabad Rain Update: హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరిక..
Hyderabad Rain
Hyderabad Rain Update: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న విస్తార వర్షాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్ నగరం కుండపోత వర్షంతో అతలాకుతలమైంది. గురువారం ఉదయం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షపాతం నమోదవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లి, అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులన్నీ ట్రాఫిక్ స్తంభించిపోయి, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షం ప్రభావం నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కనిపించింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్, సికింద్రాబాద్, బేగంపేట్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. కొన్నిచోట్ల నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడగా, లోతట్టు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA), జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది నగరవ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టారు. రహదారులపై నిలిచిన వర్షపు నీటిని తొలగించడం, విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించడం, మ్యాన్హోళ్ల వద్ద అడ్డంకులను తొలగించడం వంటి పనులను వేగవంతం చేశారు.
నగరంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసర అవసరం ఉంటే తప్ప ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. నీటితో నిండిన రహదారులు, పొంగిపొర్లుతున్న నాలాలు, చెరువుల సమీప ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వాహనదారులు రహదారిపై నిలిచిన నీటి లోతు తెలియకుండా ముందుకు వెళ్లొద్దని, తక్కువ వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈదురుగాలుల కారణంగా పాత భవనాలు, బలహీన నిర్మాణాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడటం ప్రమాదకరమని హెచ్చరించారు.
వర్ష పరిస్థితులను నగర పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు, పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
భారీ వర్షాలు మరో కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.