HomeNewsBreaking Newsజార్జి ఫెర్నాండెజ్ క‌న్నుమూత‌

జార్జి ఫెర్నాండెజ్ క‌న్నుమూత‌

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఆయన స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితయ్యారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేశారు. జార్జి ఫెర్నాండెజ్‌ స్వస్థలం మంగళూరు. క్యాథలిక్‌ కుటుంబంలో పుట్టిన ఫెర్నాండెజ్‌ చదువును మధ్యలోనే ఆపేసి మతాధికారిగా శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ముంబయికి మకాం మార్చి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు రైల్వే శాఖలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నో బంద్‌లు, రాస్తారోకోలు చేపట్టారు. అలా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1967 సార్వత్రిక ఎన్నికల్లో సంయుక్త సోషలిస్టు పార్టీ తరఫున దక్షిణ బాంబే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌ఏ పాటిల్‌పై విజయం సాధించి తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే ఈ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఫెర్నాండెజ్‌ జైలుకు వెళ్లారు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత 1977లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో జైలులో ఉన్న ఫెర్నాండెజ్‌ అక్కడి నుంచే పోటీ చేశారు. జనతా పార్టీలో చేరి బిహార్‌‌లోని ముజఫర్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్‌ను గద్దెదింపింది. మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫెర్నాండెజ్‌కు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు. 1988లో జనతా పార్టీ నుంచి జనతా దళ్‌ విడిపోయింది. అప్పుడు ఫెర్నాండెజ్‌ కూడా జనతా దళ్‌లో చేరి వీపీ సింగ్‌ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జనతాదళ్‌ నుంచి కూడా విడిపోయి సమతా పార్టీని స్థాపించారు. 1998-2004 మధ్య వాజ్‌పేయీ హయాంలో రక్షణమంత్రిగా వ్యవహరించారు. భారత్‌-పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం ఈయన రక్షణమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. 2004లో శవపేటికల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని రక్షణమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చివరిసారిగా 2009-2010 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఫెర్నాండెజ్‌ ఆ తర్వాత అనారోగ్య కారణాల రీత్యా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments