ప్రజాపక్షం/మేడ్చల్ జిల్లాప్రతినిధితరుచూ టివి చూస్తూ సరిగ్గా చదవడం లేదని కోపం పెంచుకున్న ఓ తండ్రి ఏకంగా కొడుకుపై టర్పంటాయిల్ పోసి నిప్పంటించాడు. కన్నతండ్రి చేసిన ఘాతుకానికి కొడుకు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ కెపిహెచ్బి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2లో వాచ్మెన్గా పని చేస్తున్న రతలవత్ బాలు తన భార్య, నలుగురు చిన్న పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన చరణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం లో ఇంటికి వచ్చిన బాలు ఇంట్లో టివి చూస్తున్న చరణ్ను బీడీ కట్ట తీసుకురావాల్సిందిగా బయటికి పంపించాడు. బయట నుంచి వచ్చిన చరణ్ తండ్రికి బీడీ కట్ట ఇచ్చి తిరిగి టివి చూస్తుండగా కోపంతో ఊగిపోయిన బాలు కొడుకును తీవ్రంగా కొట్టాడు. సరిగ్గా చదువుకోకుండా తరుచు టివి చూస్తున్నావంటూ తీవ్రంగా కొట్టడమే కాకుండా పక్కనే ఉన్న టర్పంటాయిల్ పోసి నిప్పంటించాడు. దీంతో చరణ్కు తీవ్ర గాయాలు కావడంతో తల్లి వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించింది. దాదాపు 60 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలియజేశారు. కొడుకుకు నిప్పంటించిన తండ్రి బాలుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సరిగ్గా చదవడం లేదని కొడుక్కి నిప్పంటించిన తండ్రి
RELATED ARTICLES