HomeNewsBreaking Newsసమరానికి సిద్ధం!

సమరానికి సిద్ధం!

నేటి నుంచి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌
ఓపెనర్‌గా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ
గాయంతో హర్ధిక్‌ పాండ్య దూరం
పంత్‌కు దక్కని చోటు.. సాహాకు అవకాశం
పటిష్టంగా సఫారీ జట్టు
రోహిత్‌ సెహ్వాగ్‌లా చెలరేగుతాడు: కోహ్లీ
విశాఖ : మొన్నటి వరకు విండీస్‌ గడ్డపై చెలరేగిన భారత బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు సమష్టిగా రాణించి విండీస్‌కు వైట్‌వాష్‌ చేసి మూడు ఫార్మట్ల సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. ఇక స్వదేశానికి చేరుకున్న టిమిండియా ఇప్పు సఫారీలతో సవాల్‌కు దిగింది. తొలుత సౌతాఫ్రికా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1 తృటిలో చేజార్చుకోగా ఇప్పుడు టెస్టుల సిరీస్‌పై కన్నేసింది. ఎలాగైనా సఫారిలను ఓడించి టెస్టు సిరీస్‌నైనా సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఎంతో పటిష్టంగా కనబడుతున్న సౌతాఫ్రికా జట్టు కూడా కోహ్లీ సేనను ఎలాగైన ఓడించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలె ముగిన టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ ఓడినా మరో మ్యాచ్‌లో గెలుపొంది. సిరీస్‌ సమం చేసిన సంగతి తెలిసిందే.. ఇదే జోరుతో టెస్టుల్లో రాణించాలనే ఊవిల్లురుతోంది. ఇక టెస్టు ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ సక్సెస్‌ అవుతాడా? లేదా అన్నది అప్పుడే చెప్పలేమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా బుధవారం తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం విరాట్‌ కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడాడు. కోహ్లీ మాట్లాడుతూ ‘టెస్టు ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ విషయంలో ఎప్పటి నుంచో చర్చిస్తున్నాం. రోహిత్‌ విషయానికి వస్తే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపడం అతడికి ఓ సరికొత్త స్పాట్‌ని కనుగొనడం లాంటిదే. ఓపెనర్‌గా వచ్చే బ్యాట్స్‌మన్‌కు అతడి ఆటపై అవగాహన వచ్చేవరకు సమయమివ్వాలి‘ అని వెల్లడించాడు.
ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ..
రోహిత్‌శర్మ ప్రపంచంలో ఎక్కడైనా సహజసిద్ధమైన బ్యాటింగ్‌ చేస్తే ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తమే మారిపోతుందని కోహ్లీ పేర్కొన్నాడు. ఐదారు టెస్టుల్లో అతడిని ఓపెనర్‌గా దించడానికి టీమిండియా ఆలోచిస్తుందా అని ఒక విలేకరి అడగ్గా.. ఇప్పటికిప్పుడే రోహిత్‌ దంచి కొట్టాలని జట్టు కోరుకోవడం లేదని చెప్పాడు. భారత్‌లో ఆడేటప్పుడు ఒక ప్రణాళిక, విదేశాల్లో ఆడేటప్పుడు మరో ప్రణాళిక ఉందని, ఓపెనర్‌గా వచ్చే బ్యాట్స్‌మన్‌కు అతడి ఆటపై అవగాహన వచ్చేవరకు సమయమివ్వాలని తెలిపాడు. అలాగే రోహిత్‌ నుంచి అత్యద్భుత బ్యాటింగ్‌ ఆశించడం లేదని, అతడే తన అత్యుత్తమ ఆటను కనుగొనాలని కెప్టెన్‌ వివరించాడు. హిట్‌మ్యాన్‌ బాగా ఆడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడమే అతడి బలమని, గతంలో వీరూ భాయ్‌ ఎన్నో ఏళ్లు టీమిండియాకు ఇదే పనిచేశాడని గుర్తు చేశాడు. ఎవరో చెబితే సెహ్వాగ్‌ దూకుడుగా ఆడి శతకం బాదలేదని, అది అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్‌ అని కోహ్లీ స్పష్టంచేశాడు. రోహిత్‌కు అలా ఆడే సామర్థ్యముందని చెప్పిన కెప్టెన్‌ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఆడతాడన్నాడు. ముంబయి బ్యాట్స్‌మన్‌ను ఎప్పటినుంచో టెసుో్ట్ల్ల ఓపెనర్‌గా తీసుకురావాలని భావించినా అది ఇప్పుడే కుదిరిందని, పుజారా ఫామ్‌ కోల్పోయిన సందర్భంగా ఇలా అవకాశమొచ్చిందని వివరించాడు. హిట్‌మ్యాన్‌ ఇదివరకు వన్డేల్లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఆడేవాడని, అనుకోకుండా అతడిని ఓపెనర్‌గా దించాలనే చర్చ వచ్చాక, ఆ తర్వాత ఎనిమిది నెలల్లో ఓపెనర్‌గా మారాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెలరేగినట్టు టెస్టుల్లో రాణిస్తే, అది జట్టుకెంతో మంచిదన్నాడు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కొనసాగుతున్నందున.. హిట్‌మ్యాన్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
పంత్‌ ఔట్‌.. సాహా ఇన్‌..
తొలి టెస్టులో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. తొలి టెస్టుకు రిషబ్‌ పంత్‌ స్థానంలో వృద్ధిమాన్‌ సాహాను తీసుకున్నట్లు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేశాడు. పంత్‌ను తొలి టెస్టు నుంచి తప్పించడంపై కోహ్లీ మాట్లాడుతూ పంత్‌కు తగిన అవకాశాలు ఇవ్వాలని భావించామని, అయితే ఉన్నపళంగా రాణించాలని అతడిపై ఒత్తిడి తీసుకురాలేదని తెలిపాడు. పంత్‌కు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని, విదేశాల్లో అతడి ప్రతిభ కారణంగా మరిన్ని అవకాశాలిస్తామని కోహ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. సాహా గాయం కారణంగా చాలా రోజులు ఆటకు దూరమయ్యాడని, అతడో అత్యుత్తమ కీపర్‌ అని విరాట్‌ కోహ్లీ కొనియాడాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా గతంలో అతడు జట్టుకు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని అవకాశమిచ్చినట్లు కోహ్లీ తెలిపాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ధోనీకి వారసుడిగా పంత్‌ ఆరంగేట్రం చేసాడు. మొదటిలో బాగానే ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో రెండు సెంచరీలు కూడా చేసాడు. ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పంత్‌కు ప్రపంచకప్‌లో కూడా అవకాశం ఇచ్చారు. అక్కడ రాణించలేదు. ఇక ఇటీవలి కాలంలో అతనికి పదే పదే జట్టులో స్థానం ఇస్తున్నారు. అయినా పంత్‌ పరుగులు చేయలేకయాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔట్‌ అయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చే పంత్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించలేకపోతున్నాడు. సమయం సందర్భం చూడకుండా.. భారీ షాట్‌ ఆడుతూ పెవిలియన్‌ చేరుకుంటున్నాడు. పంత్‌ తన చివరి ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐదు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌లు ఉన్నాయి.
అరుదైన రిరాక్డుకు చేరువలో కోహ్లీ..
మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ పేరిట ఉన్న మరో రికార్డుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేరువలో ఉన్నాడు. బుధవారం నుంచి విశాఖలో దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ మరో 281 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 21 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ఇదివరకు 473 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా విండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా 485 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. ఇదిలా ఉండగా విరాట్‌కోహ్లీ ప్రస్తుతం వీరిద్దరికన్నా ఎంతో ముందంజలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 432 ఇన్నింగ్స్‌ల్లో 20,719 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో సచిన్‌ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇంకా ఎంతో సమయం పట్టదు. ప్రస్తుత ఫామ్‌ చూస్తే ఈ సిరీస్‌లోనే ఆ ఘనత సాధించి చరిత్ర సృష్టించేలా కనిపిస్తున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికాపై అతడికి గతంలోనూ మంచి రికార్డు ఉంది. పర్యాటక జట్టుపై కోహ్లీ మొత్తం 9 మ్యాచ్‌ల్లో 47.37 సగటుతో 758 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు ఉన్నాయి. టీమిండియా టెస్టు చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా ఇటీవలే పేరుతెచ్చుకున్న కోహ్లీ నెల క్రితం విండీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ పూర్తయ్యాక తన కెప్టెన్సీపై స్పందించాడు. జట్టుకు నాయకత్వం వహించడమంటే అతడి పేరు ముందు c అనే అక్షరం మాత్రమే ఉంటుందని, అంతకుమించి తనలో ఏ ప్రత్యేకతా ఉండదన్నాడు. జట్టు సమష్టిగా రాణిస్తేనే విజయపథంలో నడుస్తుందని, అత్యుత్తమ జట్టు ఉన్నందునే విండీస్‌పై గెలిచామని చెప్పాడు.
టీమిండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ నుంచి వైదొలిగిన కొద్ది రోజులకే టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. ఇండియా ఫస్ట్‌ ఛాయిస్‌ ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా వెన్ను గాయంతో సుమారు ఐదు నెలలు పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గత సెప్టెంబర్‌లో దుబాయి వేదికగా జరిగిన ఆసియా కప్‌లో తొలిసారి వెన్నునొప్పికి గురైన హార్దిక్‌ పాండ్యా ఆ తర్వాత పలు సిరిస్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా, పాండ్యా వెన్నుపూస కింది భాగంలో గాయం మళ్లీ తిరగబెట్టిందని సమాచారం. దీంతో అతడు త్వరలోనే లండన్‌కు పయనం కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్ను గాయంతో బాధపడ్డాడు. నొప్పి భరించలేక నేలపై విలవిల్లాడిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ పాండ్యా గాయంపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఆసియా కప్‌ తర్వాత తొలిసారి గాయపడినప్పుడు ఎవరైతే డాక్టర్‌ పాండ్యాకు చికిత్స అందించాడో అదే వైద్యుడిని మళ్లీ సంప్రదించడానికి హార్దిక్‌ యునైటె్‌డ కింగ్‌డమ్‌కు వెళ్లనున్నాడు. పాండ్యా ఖచ్చితంగా బంగ్లాదేశ్‌ సిరీస్‌ ఆడటం లేదు. అయితే, అతడు ఎంతకాలం క్రికెట్‌కు దూరమవుతాడో ఇంకా స్పష్టంగా తెలియలేదు. యునైటె్‌డ కింగ్‌డమ్‌ నుంచి వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుంది‘ అని అన్నారు. యునైటె్‌డ కింగ్‌డమ్‌లోని వైద్యులను సంప్రదించిన తర్వాత హార్దిక్‌ పాండ్యాను జర్మనీని పంపే ఆలోచనలో కూడా బీసీసీఐ ఉంది. ఒకవేళ పాండ్యాకి సర్జరీ గనుక చేయాల్సి వస్తే అతడు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కూడా హార్దిక్‌ పాండ్యా చోటు దక్కించుకోలేపోయాడు. కూర్పులో భాగంగా హార్దిక్‌ టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వని సంగతి తెలిసిందే. అంతేకాదు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హాజారే ట్రోఫీలో కూడా బరోడా జట్టు తరుఫున ఆడటం లేదు. దీంతో ఐపీఎల్‌ 2020 ప్రారంభమయ్యే నాటికి జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌ప్‌లో హార్దిక్‌ పాండ్యా కీలక ఆటగాడిగా ఉన్నాడు. దీంతో పాండ్యాకు టెస్టు క్రికెట్‌ కంటే కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనే ఎక్కువ అవకాశాలు కల్పించాలని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ భావిస్తున్నారు. కాగా, భారత్‌ తరుపున ఇప్పటివరకు 11 టెస్టులాడిన పాండ్యా 532 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టాడు. 54 వన్డేలాడి 937 పరుగులు చేయడంతో పాటు 54 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, భారత్‌ తరుపున 40 టీ20 మ్యాచ్‌లాడి 310 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు పడగొట్టాడు.
తొలి టెస్టుకు టీమిండియా:
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానే(వైస్‌కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments