HomeNewsBreaking Newsసడలింపులుండేనా?

సడలింపులుండేనా?

నేడు రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం
జిహెచ్‌ఎంసిలో కరోనా వ్యాప్తిపై ఫోకస్‌
కేంద్ర మినహాయింపులను అమలు చేసే అంశంపై చర్చ
ఆశగా ఎదురుచూస్తున్న వ్యాపార వర్గాలు, ‘మందు’బాబులు
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి
ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో లాకౌడౌన్‌ పొడిగింపు, సడలింపులు, మద్యం విక్రయాలపై మరికొన్ని గంటల్లోనే ఉత్కంఠకు తెర పడనుంది. ఈ నెల 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగి స్తూ, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో కొన్ని సడలింపులు, మరిన్ని మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే పొరుగు రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సడలింపులు, మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు అమలు చేస్తుందనేది ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్‌, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, వ్యాపార వర్గాలకు మినహాయింపులు, మద్యం అమ్మకాలు, ప్రధానంగా ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ పరిధిలో సడలింపులు తదితర అంశాలపై చర్చించనున్నారు. రెడ్‌జోన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయడం అలాగే వలస కూలీల అంశంపై కూడా చర్చకు రానుంది. ఇది వరకే కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు పొడిగిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్‌ మరో నాలుగు రోజులు అదనంగా 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈసారి కేంద్రం 17 వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో అదనంగా మరో నాలుగు రోజులతో ఈనెల 21 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటైన్‌మెంట్‌ గడువు జోన్‌ పరిధిలో ఈనెల 21తో గడువు ముగుస్తున్నందున అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్ర పరిస్థితులు, తాజా పరిణామాలు నేపథ్యంలో కేంద్రం నిర్ణయించిన సడలింపులు అమలు చేయాలా, వద్దా అనే విషయమై కూడా సిఎం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. డేంజర్‌ జోన్‌ నుండి బయటపడిన తాజాగా జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదు కావడం కొంత ఆందోళను గురిచేస్తోంది.
గ్రే‘డర్‌’లో పెరుగుతున్న కేసులు: ష్ట్రీడ్‌జోన్‌లో ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు పెరుగుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ గడిచిన రెండు,మూడు రోజుల నుండి కేవలం గ్రేటర్‌ పరిధిలోనే సుమారు 60 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పడితే మరోవైపు కొత్త ప్రాంతాలు హాట్‌స్పాట్‌ జాబితాలో చేరుతున్నాయి. దీంతో హైదరాబాద్‌ విషయంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని, అలాగే లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సిఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని కొని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయమై కొంత తర్జన భర్జన సాగుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments