HomeNewsBreaking Newsసచివాలయానికి అంబేద్కర్‌ పేరు

సచివాలయానికి అంబేద్కర్‌ పేరు

సిఎం కెసిఆర్‌ నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ర్ట సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన ఆదేశాలు జారీచేశారు. సచివాలయానికి డాక్టర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడం వెనుక ఉద్దేశాన్ని సిఎం కెసిఆర్‌ వివరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ‘తెలంగాణ రాష్ర్ట ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రెటేరియట్‌కు భారత సామాజిక దార్శనికుడు మహా మేధావి డాక్టర్‌ బి.ఆర్‌ .అంబేద్కర్‌ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్‌ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ర్టం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్‌ అంబేడ్కర్‌ మహాశయుని ఆశయాలు ఇమిడి వున్నవి. అంబేడ్కర్‌ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పాటయ్యింది. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నది. అంబేద్కర్‌ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. ఫెడరల్‌ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్‌ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తున్నది. భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ర్టం, అంబేద్కర్‌ మహాశయుని పేరును రాష్ర్ట సెక్రెటేరియట్‌కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్‌ పేరును పెట్టాలని ఏదో ఆషామాషీగా కోరుకున్నది కాదు. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా. ఇదే విషయమై తాను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లేఖ కూడా రాసి పంపుతాను. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి అంబేద్కర్‌ పేరును పెట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నానని’ కెసిఆర్‌ వివరించారు.
చారిత్రాత్మకం : పోచారం
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని నిర్ణయించడం పట్ల అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్‌కు ఇస్తున్న గొప్ప గౌరవమన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
భట్టి విక్రమార్క భట్టి హర్షం
రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌ లో నూతనంగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ పేరు పెడుతున్నట్టు సిఎం కెసిఆర్‌ చేసిన ప్రకటనపై సిఎల్‌పి నేత భట్టి విక్రమర్క గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. దేశ రాజధానిలోని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడానికి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సోమవారం సభలో తాను చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని సిఎం కెసిఆర్‌ తీర్మానం చేయించారని గుర్తు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments