HomeNewsBreaking Newsవ్యూహరచనలో కాంగ్రెస్‌!

వ్యూహరచనలో కాంగ్రెస్‌!

వేదికైన ఖమ్మం : సమావేశానికి హాజరైన అధినాయకత్వం
కెసిఆర్‌ను జైలుకు పంపడం ఖాయం : మాణిక్కం ఠాకూర్‌
వేధిస్తున్న పోలీసులను వదలం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో కాంగ్రెస్‌ భవిష్యత్తు వ్యూహాన్ని రచించుకునేందుకు ఖమ్మం వేదికైంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్జ్‌ మాణిక్కం ఠాకూర్‌ సహా కాంగ్రెస్‌కు చెందిన అగ్ర నాయక త్వం ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశానికి హాజరైంది. డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర నాయకులతో రెండున్నర గంటల పాటు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఇతరులను ఎవరినీ అనుమతించ లేదు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులను, మీడియాను కూడా అనుమతించలేదు. నీరసపడిన కాంగ్రెస్‌కు తిరిగి జవసత్వాలు ఇవ్వాలన్న దానిపైనే తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తుంది. బిజెపి దూకుడు, టిఆర్‌ఎస్‌ వ్యవహార శైలిపైన కాంగ్రెస్‌ నేతలు మాట్లాడినట్లు సమాచారం. మొత్తంగా చాలా కాలం తర్వాత ఖమ్మం సీక్వెల్‌ రిసార్ట్‌లో కాంగ్రెస్‌ వ్యూహానికి సంబంధించి సమావేశం జరగడం కాంగ్రెస్‌ ఏదో చేయబోతుందన్న విషయాన్ని ప్రజలకు చెప్పకనే చెప్పినట్లయింది. సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రానున్న ఎన్నికలే అజెండాగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలపై కూడా చర్చించినట్లు కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు. అనంతరం బూత్‌ స్థాయి బాధ్యుల సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాకూర్‌ మాట్లాడుతూ రెండేళ్లలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కెసిఆర్‌ను జైలుకు పంపడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతిపై విచారణకు ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తామన్నారు. టిఆర్‌ఎస్‌, బిజెపిలు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ నాటకాలు ఆడుతున్నాయన్నారు. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ వనరులను కెసిఆర్‌ కుటుంబం దోచుకుంటుందని, ఆయన కుటుంబ అక్రమ సంపాదనపై ఇడి, ఐటి, సిబిఐ కేసులను నుంచి తప్పించుకునేందుకే మోడీ, అమిత్‌షాకు కెసిఆర్‌ దండాలు పెడుతున్నారని వారి పేరు చెబితే కెసిఆర్‌ వణికిపోతున్నారని మాణిక్యం ఠాకూర్‌ తెలిపారు. భద్రాచలం శ్రీరాముని సాక్షిగా కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారిని ఎవరిని తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోబోమన్నారు.
ఎవరిని వదలం : ఉత్తమ్‌
కొందరు పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్నారని అటువంటి వారిని ఎవరిని వదిలి పెట్టేది లేదని పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇటువంటి వారి జాబితా తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. రుణమాఫీకి డబ్బులు లేవని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాటలను స్వాగతిస్తున్నామని కొనుగోలు కేంద్రాలు ఇతర వ్యవహారాలకు సంబంధించి రాజేందర్‌ ముఖ్యమంత్రి మాటలకు విరుద్ధంగా మాట్లాడడం అభినందనీయమన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ కెటిఆర్‌కు రెండు కళ్లు అయితే పొంగులేటికి టిక్కెట్‌ రాకుండా అజయ్‌కుమార్‌ ఎందుకు అడ్డుపడ్డారని ఆయన ప్రశ్నించారు. మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ప్రజాస్వామ్యం భావస్వేచ్ఛ లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ పార్టీ నియంతృత్వ వ్యవస్థలా వ్యవహరిస్తుందని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. దాదాపు 33 జిల్లాల డిసిసి అధ్యక్షులు 2వేల మందికి పైగా బూత్‌ కమిటీ బాధ్యులు హాజరు కాగా ఈ సమావేశానికి ఏఐసిసి కార్యదర్శి బోసురాజు, శ్రీనివాసన్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు వి. హన్మంతరావు, రేణుకాచౌదరి, బలరాం నాయక్‌, సంభాని చంద్రశేఖర్‌, పోట్ల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments