హామీలు అమలు చేయని ప్రధానమంత్రి నేటి తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా
సిపిఐ నిరసనలు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని రిపేరింగ్ సెంటర్ పెడతారా? బిజెపికి వ్యతిరేకంగా సిఎం కెసిఆర్ తుది వరకు పోరాడాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
కూనేంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/హైదరాబాద్ ఎపి పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో ఈ నెల 8న రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లుగా హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు వరంగల్, హన్మకొండ జిల్లాలలో 7వ తేదీన, బయ్యారం ఉక్కు కర్మాగారం చేపట్టనందుకు కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయనందుకు ములుగు జిల్లాలలో ఈ నెల 8వ తేదీన సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీల అమలుపై ప్రధాని వద్దకు సిఎం కెసిఆర్ అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్ళాలని కోరారు. సిపిఐ జాతీయ కార్యదర్శి
సయ్యద్ అజీజ్ పాషా , కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, ఎన్.బాలమల్లేశ్తో కలిసి హైదరాబాద్, మగ్దూంభవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు నుండే ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాల ఫలితంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారని కూనంనేని గుర్తుచేశారు. అది కాకుండా ఈ నెల 8న ప్రధాని వరంగల్ పర్యటలో రైల్వే వ్యాగన్ రిపేరింగ్, ఓవర్ హాలింగ్ ప్లాంట్కు శంకుస్థాపన చేయడమేమిటని నిలదీశారు. అలాగే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని, పాల్వంచలో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ సైతం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నారు. కానీ తొమ్మిదేళ్ళైనా అమలు చేయలేదన్నారు. విభజనచట్టంలో ఇచ్చిన ఐఐటి, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ వంటి అనేక హామీలు కూడా అమలుచేయలేదని కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆర్థికంగా ఎంతో సాయం చేశామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెబుతున్నారని, అసలు విభజన హామీలలో ఏవి అమలు చేశారో రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. సింగరేణి గనులను కూడా ఇష్టానుసారం ప్రైవేటుపరం చేస్తున్నారని, అందుకు నిరసనగా సింగరేణి గనులలో ఈ నెల 8న కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు.
బిజెపిని నిలవరించేందుకు కెసిఆర్ తుది వరకు పోరాడాలి
“ప్రతిపక్ష ముక్త్ భారత్’ పేరుతో బిజెపి ఆడుతున్న విష క్రీడను మహారాష్ట్రలో చూస్తున్నాం. ఇప్పటికే శివసేను చీల్చిన బిజెపి, తాజాగా ఎన్సిపిని చీల్చింది. తెలంగాణలో కూడా జూద క్రీడ లాంటి రాజకీయ క్రీడ ఆడాలని చూస్తున్నదని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. బిజెపిని నిలువరించేందుకు సిఎం కెసిఆర్ తుదివరకు పోరడాలి” అని కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణలో తామే గెలిచి అధికారంలోకి రానున్నామని బిజెపి నేతలు ఊహల పల్లకిలో విహరించారని, మునుగోడు ఉప ఎన్నికలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల వల్ల రాష్ట్రం బిజెపికి ముల్లబాటగా మారిందన్నారు. మునుగోడులో బిఆర్ఎస్ కాకుండా బిజెపి గెలిచి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికే ప్రమాదం వచ్చేదని, రాష్ట్రం అస్థిరంగా మారేదన్నారు. బిజెపిని కమ్యూనిస్టులు నిలువరించకపోతే ప్రమాదకర పరిణామాలు ఉండేవన్నారు. దాని ప్రభావం కర్నాటక ఎన్నికలపై కూడా పడేదన్నారు. కర్నాటకలో బిజెపి ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, మానసిక ప్రభావం మునుగోడు ఉప ఎన్నిక నుండే పడిందని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావించిన బిజెపి అకస్మాత్తుగా అధ్యక్షుడిని మార్చిందని, నరేంద్ర మోడీ, బిజెపి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణలో ఆ పార్టీకి స్థానం ఉండబోదని స్పష్టం చేశారు.
ఆ భూములకు పట్టాలు.. ఇళ్ళ నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలి
టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్, పల్లెల అభివృద్ధి, రైతులకు సంబంధించి మంచి పనులు చేస్తున్నప్పటికీ, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హన్మకొండ, వరంగల్ తదితర అనేక చోట్ల సిపిఐ భూ పోరాటలు చేస్తోందని, పేదలకు ఇళ్ళ స్థలాలు పంచిందని, వాటికి జి.ఒ 58 కింద పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇచ్చిన భూమిలో ఇళ్ల నిర్మాణానికి గృహలక్ష్మి కింద సాయం మంజూరు చేయాలని, అయితే ఆ పథకం కింద ఇచ్చే రూ.3 లక్షలు సరిపోవని, కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలిపి గృహనిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలని సూచించారు.
మోడీ పర్యటనను తెలంగాణ సమాజం నిరసించాలి : చాడ
ప్రధాని మోడీ పర్యటనను తెలంగాణ సమాజమంతా నిరసించాలని చాడ వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తూ, రాష్ట్ర హక్కులను హరిస్తోందని విమర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తిరస్కరించి, మరో చోటకు ఆ ఫ్యాక్టరీని తరలించడమేమిటని కేంద్రాన్ని నిలదీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు.