HomeNewsBreaking Newsలాభసాటిగా వ్యవసాయం

లాభసాటిగా వ్యవసాయం

మొండి పట్టుదల, నిరంతర శ్రమతో పని చేయాలి
వ్యవసాయాధికారులకు సిఎం ఆదేశం
సాగు పద్ధతుల్లో గొప్ప పరివర్తన రావాలని సూచన
ప్రజాపక్షం/హైదరాబాద్‌  లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర శ్రమతో పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలమెంతో చూపించేందుకు, మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని, నాయకత్వం వహించాలని కోరా రు. వ్యవసాయ శాఖ సంస్థాగతంగా బలోపే తం కావాలని, అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం కూడా మూడు నెలల్లో పూర్తి అవుతుందని, రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయని, ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుందని అన్నారు.
దేశ దేశాల్లో సాగు పద్దతులను అధ్యయనం చేయాలి
దేశంలో, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేసేందుకు అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలని సిఎం కెసిఆర్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్‌ ఉందో తెలుసుకోవాలని, మార్కెట్‌ను అధ్యయనం చేయాలని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, మేలు రకమైన కూరగాయలు, ఆహార పదార్థాలు వారికి అందించేలా పంటలు సాగు చేయాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారాలని, అంతిమంగా రైతులు ధనిక రైతులుగా మారాలని, అందుకోసమే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నదని, ఎంతో వ్యయం చేస్తున్నదని, ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలం కావాలని సిఎం అన్నారు. సంప్రదాయక వ్యవసాయ పద్దతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలని, ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలని, యాంత్రీకరణ పెరగాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సింగిల్‌ పిక్‌ క్రాప్స్‌ వచ్చాయని, వాటిని అధ్యయనం చేయాలని, తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలని, వాటి సాగు పద్దతులు తెలుసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు.
ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి
వ్యవసాయ శాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా పునర్‌ వ్యవస్థీకరించాలని, పంటల ఆధారంగా వ్యవసాయ శాఖ ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసి ఒక్కో విభాగానికి ఒక్కో అడిషనల్‌ డైరెక్టర్‌ను నియమించాలని సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని, పెరిగిన విస్తీర్ణం, అవసరాల మేరకు అవసరమనుకుంటే అదనంగా ఎఇవోలను నియమించుకోవాలన్నారు. ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేయాలని, దాని పరిధిలో ఏఏ పంటలు ఉంచాలో నిర్ణయించాలని కోరారు. కాబట్టి రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే, వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చన్నారు. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట వేశాడనే లెక్కలు తీయాలన్నారు. మన ప్రజలకు మనమే తిండి పెట్టే విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. కేవలం ఆహారమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments