సిఎం కెసిఆర్ పిలుపు
ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథా అనుసంధానం అవసరమని వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్ ఉద్యమ పంథాకు, పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించడం ద్వారా మాత్రమే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారంలో అనుసరించడంతోనే గమ్యాన్ని చేరుకోగలమని సిఎం స్పష్టం చేశారు. ఈ దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని జాతీయ రైతు నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘జాతీయ సంఘాల నేతల’తో ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం రెండవ రోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదికను ఏర్పాటు చేయాలనే చేసిన తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ సందర్భంగా సిఎంకెసిఆర్ మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని పంచాలని, ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన విషయాన్ని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. వివిధ ఉద్యమ రూపాల ద్వారా ప్రజలను చైతన్య పర్చి, ఓటు అనే ఆయుధాన్ని ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు. రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని, అందుకు అసెంబ్లీ, పార్లమెంటులే వేదికలన్నారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృమైన చరిత్ర స్వాతంత్య్ర భారతంలో కనిపించదన్నారు. తెలంగాణ వ్యతిరేకులతో నాడు ’జై తెలంగాణ’ నినాదాన్ని అనిపించినట్టే, నేడు రైతు వ్యతిరేకులతో ’జై కిసాన్ నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదన్నారు.
జట్టుకట్టి, పట్టు పడితే.. సాధించలేనిది ఏమీ లేదు
రైతన్నలో గొప్ప శక్తి దాగి ఉన్నదని, దీనిని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నదన్నారు. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే అన్వేషించాలని, జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదని విషయాన్ని తాను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసిందని కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనుసరించాల్సిన వ్యూహాలను, సుదీర్ఘంగా జరిగిన చర్చలను ఆయన రైతులకు వివరించారు.
రాజకీయాల్లో రైతు నేతలూ భాగస్వాములు కావాలె
రాజకీయాలు చేయడమంటే నామూషీ అని భావించడం తప్పని,దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదని కేసీఆర్ ప్రశ్నించారు. రాజకీయాలంటే అయోమయం అవసరం లేదని, మొహమాటాల నుంచి రైతు నేతలు బయటపడి రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఆందోళన అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దామని, ఎక్కడ రాజకీయాలు అవసరమై అక్కడ రాజకీయాలు చేద్దామని, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడ్డామని, రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదని తెలిపారు.
జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం..
రైతు సంఘాల నాయకులందరూ ‘మీమీ ప్రాంతాలకు’ చేరుకుని, ఈ సమావేశ నిర్ణయాలను, అంశాలను తమ తమ సంఘాల నేతలు, రైతులతో చర్చించాలని, దీనిపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దామని, దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదామని, దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విని, జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను, పలు రంగాలకు చెందిన మేధావులను, జర్నలిస్టులను ఆహ్వానించి, వారందరితో లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దామని సిఎం కెసిఆర్ అన్నారు. ఆ సమావేశాల్లో దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను, కార్యాచరణ బ్లూ ప్రింట్ ను రూపొందించుకుందామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామస్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని, రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దామన్నారు.
‘అవ్వల్ దర్జా కిసాన్’ లను తయారు చేద్దాం..
తాను స్వయానా ఒక రైతునని, తనకు రైతు కష్టాలకూ, వాటికి పరిష్కారాలు తెలుసని సిఎం కెసిఆర్ అన్నారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందామన్నారు. ఒక సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో ధీటుగా చర్చించేలా వారిని తీర్చిదిద్దుదామని, రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభించాలని, దేశ రైతును ఆత్మగౌరవంతో తలెత్తుకుని తిరిగేలా ‘అవ్వల్ దర్జా కిసాన్’ గా తయారు చేద్దామని సీఎం కెసిఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.
కెసిఆర్ నాయకత్వం వహించాలని రైతుల తీర్మాణం
దేశ రైతాంగాన్ని గ్రామ స్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్ను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించింది. నాటి వ్యవసాయ పరిస్థితులకు, ప్రస్తుత మారిన పరిస్థితుల నేపథ్యంలో అవలంభించాల్సిన ఉద్యమ కార్యాచరణ, విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్ ను రూపొందించి,దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్దం చేయాలని సీనియర్ రైతు నేతలు సీఎం కేసీఆర్ను కోరారు. వ్యవసాయ రంగ సమస్యలు పరిష్కారాలకు సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలతో భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. స్వాతంత్య్ర కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలపై చర్చించారు. కాగా ప్రధాని మోడీ రైతు వ్యతిరేక చర్యలు దేశ రైతాంగానికి ప్రమాదకరమని, ఇలాంటివి మరోసారి రాకుండా చూడాల్సిన గురుతర బాధ్యత దేశ రైతాంగంపైనే ఉన్నదని తమిళనాడుకు చెందిన రైతులు స్పష్టం చేశారు. దేశం మిమ్మల్ని ఆహ్వానిస్తోందని “ ప్లీజ్ సేవ్ ఇండియన్ ఫార్మర్స్”అంటూ వారు సీఎం కేసీఆర్ ను అభ్యర్థించారు. వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్ వంటి నాయకుల చేతుల మీదుగానే ప్రారంభం కావాలని, ఒకే దేశం ఒక్కటే రైతు సంఘం అనే నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితేనే మన సమస్యలు సంపూర్ణంగా పరిష్కారమవుతాయని, ఆ దిశగా మమ్మల్ని నడిపించాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని సౌత్ ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.
కార్పొరేట్ గద్దలకు వ్యవయసాయాన్ని అప్పగించే కుట్ర
ఇక నుండి సిఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దామని, ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందామని పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ రైతులు దేశ రైతాంగానికి పిలుపునిచ్చారు. మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకున్నామని, మన జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించామన్నారు. నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని రైతు సమావేశం అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతోందని, దీన్ని తిప్పికొట్టాలని, ఒక్క ఎకరం కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా కాపాడుకుంటామని సమావేశంలో రైతులు తీర్మానం చేశారు. రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నమ్మబలుకుతూ, మండీలను ఖతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. అలాగే దళిత బంధు సహా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు తదితర వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు మిగతా రాష్ట్రాలల అమలు సాధ్యమేనని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ స్కీములు కేంద్రంలోని పాలకుల్లో భయాన్ని సృష్టిస్తున్నాయన్నారు. దళితబంధు పథకం ఒక విప్లవాత్మకమని ఉత్తర ప్రదేశ్ రాఘవేంద్ర కుమార్ అనే దళిత రైతు అన్నారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, కృషితోనే శాంతి ఫరిఢవిల్లుతున్నదని, ఇటీవల పెచ్చరిల్లుతున్న మత విద్వేషాల ప్రభావం హైదరాబాద్పైన పడలేదనే విషయాన్ని తాము గ్రహించామని, ఇది బీజేపీ మతతత్వ శక్తులకు సరైన గుణపాఠంగా నిలిచిందని ఈసమావేశంలో పాల్గొన్న రైతులు స్పష్టం చేశారు.
జాతీయ రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డితో పాటు దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మూడు రోజులపాటు తెలంగాణలో సాగిన ‘జాతీయ రైతు సంఘాల నేతల పర్యటన’ ఆదివారంతో ముగిసింది.
రైతు ఆత్మగౌరవం కోసం కలిసి పనిచేద్దాం
RELATED ARTICLES