కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 50శాతానికి పెంచాలి
కాళేశ్వరం, మిషన్ భగీరథలకు రూ.53వేల కోట్లు గ్రాంట్ ఇవ్వండి
సంక్షేమ పథకాలను రాష్ట్రాలకే వదిలేయాలి
పన్నులు ఎక్కువ వచ్చే రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలి
15వ ఆర్థిక సంఘానికి సిఎం కెసిఆర్ సూచనలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 50 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 15వ ఆర్థిక సంఘాన్ని కోరారు. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కె. సింగ్ నేతృత్వంలోని బృందం మూడు రోజుల పర్యటన నిమి త్తం రాష్ట్రానికి వచ్చింది. పర్యటనలో భాగంగా వివిధ వర్గాలను కలిసి అభిప్రాయాలను స్వీకరిస్తున్న ఈ బృందం మంగళవారం జూబ్లిహాల్లో సిఎం కెసిఆర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్కె.జోషి నీటిపారుదల ప్రాజెక్టులపై, సిఎంఒ కార్యదర్శి స్మితా సబర్వాల్ మిషన్ భగీరథపై, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావ్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ఆర్థికాంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశాన్ని ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను పెంచినప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు ద్రవ్యభారం పడలేదన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అదే ఆర్థిక సంఘం సిఫారసు మేరకు బిఆర్జిఎఫ్, మో డల్ స్కూల్ వంటి పథకాలకు నిధులను నిలిపివేసిందని కేంద్ర ప్రా యోజిత కార్యక్రమాల్లో రాష్ట్ర వాటాను పెంచిందని ఆయన తెలిపారు. ఫలితంగా తెలంగాణకు రెండు విధాలుగా దెబ్బతగిలిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచాలని ఆర్థిక సంఘం బృందానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ద్రవ్యలోటును జిఎస్డిపిలో 3శాతానికి కట్టడి చేస్తున్న రాష్ట్రాలు అదనంగా రుణాలు తెచ్చుకునే సదుపాయాన్ని కొనసాగించాలన్నారు. ప్రస్తుతం జిఎస్డిపిపై 3శాతంగా ఉన్న ఈ రుణపరిమితిని అదనంగా ఒక శాతం పెంచాలని కోరారు