భారత్ చేరుకున్న ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు
అంబాలా ఎయిర్బేస్లో సురక్షితంగా ల్యాండింగ్
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాల్లో భాగంగా తొలి విడత విమానాలు బుధవారంనాడు భారత్కు చేరుకున్నాయి. భారత వైమానిక దళం(ఐఎఎఫ్) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా వైమానికి స్ధావరానికి చేరుకున్నాయి. దీంతో మన సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం తొలి బ్యాచ్ లో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధవిమానాలు చేరుకోగానే భారత నౌకా యుద్ధవిమా నం నుంచి భారీ స్వాగతం లభించింది. ‘హిందూ మహా సముద్రానికి స్వాగతం మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు..హ్యాపీ ల్యాండింగ్స్’ అంటూ ఐఎన్ఎస్ కోల్కతా రాఫెల్ జెట్స్కు రేడియో సందేశం పంపింది. ఇందుకు రాఫెల్ పైలట్ ధన్యవాదాలు తెలిపారు. రాఫెల్ యుద్ధవిమానాలు అంబాలకు చేరగానే వాటిని వైమానిక దళంలో చేర్చే కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించారు. ఇక చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లడఖ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అత్యాధునిక రాఫెల్ యుద్ధవిమానాలు చేరుకోవడంతో ఐఎఎఫ్ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో మొదటి రాఫెల్ జెట్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. మొదటి బ్యాచ్లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్ధఫ్రా ఎయిర్బేస్లో సోమవారం సాయంత్రం దిగాయి.
రాఫెల్ విమానాలువచ్చేశాయ్!
RELATED ARTICLES