టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో మంత్రి కెటి రామారావు భేటీ
సంస్థ విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఐటి పరిశ్రమల శాఖమంత్రి కెటి రామారావు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ను కోరారు. సంస్థ విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలన్నారు. ముంబయిలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కెటిఆర్ గురువారం భేటీ అయ్యారు. టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్లో ఆ సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య, అవకాశాలపైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను మంత్రి కెటిఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్నారు. టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించారు. ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్నందున హైదరాబాదులో ఒక ఎమ్మార్వో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని నటరాజన్ చంద్రశేఖరన్ తెలిపారు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపట్ల అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువుగా ఉంటుందని తమ సంస్థ అనుభవం నిరూపించిందన్నారు. భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో కచ్చితంగా తెలంగాణకు కీలకమైన స్థానం కల్పిస్తామని ఆయన కెటిఆర్కు హామీనిచ్చారు. దేశ ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య పరిస్థితులు, వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాల వంటి అనేక ఇతర అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ జెఎస్డబ్ల్యు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. జెఎస్డబ్ల్యు సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అపార విజయవంతమైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని,ఈ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెటిఆర్ జిందాల్ను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సేయిల్ సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని కెటిఆర్ గుర్తుచేశారు. బయ్యారంతో పాటు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఉన్న ఇనుప ఖనిజం నిల్వలను దృష్టిలో పెట్టుకుని అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని కెటిఆర్ వివరించారు. జెఎస్డబ్ల్యు వంటి ప్రతిష్టాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కెటిఆర్ హామీనిచ్చారు. జిందాల్ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిందాల్ ని కెటిఆర్ కోరారు.
హిందూస్థాన్ ఎండితో సమావేశం
అనంతరం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన మంత్రి కెటిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎమ్సిజి రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని కెటిఆర్ అన్నారు. ఈ రంగంలో ఇతర సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పామ్ఆయిల్ ఉత్పత్తి కోసం ఒక బృహత్తర లక్ష్యాన్ని ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహిస్తోందన్నారు. వంట నూనెల ఉత్పత్తి కోసం హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమన్నారు ఆ తరువాత ఆర్ పి జి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయంకా తోనూ కెటిఆర్ సమావేశమై, పెట్టుబడులు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.
మరిన్ని పెట్టుబడులు పెట్టండి
RELATED ARTICLES